బీజేపీని ఢీకొట్టే సత్తా లేదు: కాంగ్రెస్పై అసదుద్దీన్ ఒవైసీ సంచలనం, మోడీకి వార్నింగ్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకు పోతేనే అది సాధ్యమవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఏమీ చేయలదేని తేల్చి చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. ఈ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ, బీజేపీని ఎదుర్కోవాలంటూ కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలను కలుపుకుని పోవాలని ఆయన హితవు పలికారు. వికారాబాద్లోని నిర్వహించిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీ చేయనప్పటికీ.. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తాను అక్కడ లేనప్పటికీ బీజేపీ ఎలా గెలిచిందన్నారు. తాము పోటీ చేసి బీజేపీ గెలిస్తే.. తమను బీజేపీకి బీ టీమ్ అనేవారని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఇందుకు ఎవరు కారణం అని ఒవైసీ నిలదీశారు.
వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా తీసుకొస్తే సమాజంలో అశాంతి నెలకొంటుందని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. వక్ఫ్ సవరణ చట్టం అమలైతే మసీదులు, దర్గాలు లాక్కుంటారని అన్నారు. ఒక వేళ వక్ఫ్ బిల్లు చట్టంగా మారిస్తే.. దేశంలో అశాంతి, అస్థిరత చోటు చేసుకుంటాయంటూ ప్రధాని మోడీని హెచ్చరించారు. 1980, 1990లకు దేశాన్ని తీసుకెళ్తామన్నారు. తాము ఒక మసీదును కోల్పోయామని.. ఇక దేన్నీ వదులుకోదలుకోమని అన్నారు.
మరోవైపు, పాలస్తీనాకు మద్దతుగా అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. యూఎన్ ఆర్మీపైనా ఇజ్రాయెల్ దాడి చేసిందని, గాజాలో 40 వేల మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని చెప్పారు. ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరాపై భారత్ వైఖరి ఏంటని ప్రశ్నించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల వ్యవహారంలో ఆయన బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications