ఎట్టకేలకు.. నీరవ్ స్పందన: నాశనం చేసేశారు.. ఇప్పుడిక కష్టం..
ముంబై: డబ్బా కంపెనీల పేరు మీద అక్రమంగా ఎల్వోయూలు జారీ చేయించుకుని బ్యాంకులకు వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎట్టకేలకు స్పందించాడు. స్కామ్ వెలుగుచూడక ముందే విదేశాలకు చెక్కేసిన ఆయన.. తన తాజా స్పందనలో తప్పంతా బ్యాంకులదే అన్న రీతిలో మాట్లాడారు.
రుణాల చెల్లింపుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు తానిచ్చిన ఆఫర్ ను పట్టించుకోలేదని, అత్యుత్సాహంతో వ్యవహరించి తన దారులన్ని మూసివేసిందని నీరవ్ ఆరోపించారు.
Recommended Video
నీరవ్ లేఖ..:
తనపై వస్తున్న ఆరోపణలకు బదులిస్తూ నీరవ్ మోడీ పీఎన్బీ యాజమాన్యానికి తాజాగా ఓ లేఖ రాశారు. పీఎన్బీ తనపై చేసిన ఆరోపణలన్ని తప్పుడువేనని అందులో పేర్కొన్నారు.
ఫైర్స్టార్ గ్రూపునకు చెందిన విలువైన ఆస్తులను విక్రయించడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఆ డబ్బుతో బకాయిలు తీరుస్తానని, ఇందుకు గాను పీఎన్బీ తనకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
ఇప్పుడిక సాధ్యం కాదు..:
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా దీన్ని పేర్కొనడాన్ని నీరవ్ తప్పుపట్టారు. ఇది వాస్తవ దూరంగా ఉందని అన్నారు. భారత్ లోని తన మొత్తం వ్యాపార విలువ రూ.6500కోట్ల వరకు ఉందని, ఆ డబ్బుతో తాను బకాయిలను సులువుగానే తీర్చగలిగి ఉండేవాడినని అన్నారు. అయితే ప్రస్తుతం తన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడిక అది సాధ్యం కాదని లేఖలో చెప్పుకొచ్చారు.
బ్రాండ్.. నాశనం చేశారు:
రుణాలను రివకరీ చేసే విషయంలో పీఎన్బీ అత్యుత్సాహానికి పోయి ఈ విషయాలన్ని బహిర్గతం చేసిందని నీరవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంతో రుణాలను తిరిగే చెల్లించే తన సామర్థ్యంపై దెబ్బకొట్టారని అన్నారు. తన బ్రాండ్ నేమ్ను, వ్యాపార్యాన్ని నాశనం చేశారని అసహనం వెళ్లగక్కారు.
అలాగే రుణాల రికవరీ కోసం ఫిబ్రవరి 13న తాను ఇచ్చిన ఆఫర్ను బ్యాంకు పట్టించుకోలేదన్నారు. బ్యాంకు ప్రతినిధులతో ఫిబ్రవరి 13, 15వ తేదీల్లో జరిపిన చర్చల వివరాలను కూడా లేఖలో పేర్కొన్నారు.
తీసుకున్నది 5వేల కోట్లే:
రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం తనకున్నా.. బ్యాంకు అధికారులు వారికి వారే ఆ అవకాశాలను పరిమితం చేశారని ఆరోపించారు. నిజానికి తన కంపెనీ రూ.5వేల కోట్లు మాత్రమే రుణంగా పొందినట్టు తెలిపారు.
మీడియా అతి కూడా..:
మీడియా చేసిన అతి కూడా తన ఆస్తులపై దాడులకు, స్వాధీనానికి కారణమైందన్నారు నీరవ్ మోడీ. తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడంతో పాటు ఫైర్స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. అధికారిక చర్యలకు తాను బాధ్యత వహిస్తానని, తన ఖాతాల్లో ఉన్న డబ్బు ద్వారా 2200మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అనుమతించాలని బ్యాంకుకు అప్పీల్ చేశారు.