ఆత్మహత్యకు పాల్పడిన CTS కంపెనీ మహిళా టెక్కీ
కోయంబత్తూరు: కోయంబత్తూరులో విషాదం చోటు చేసుకుంది. స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడి ఆ మరుక్షణమే 22 ఏళ్ల మహిళా టెక్కీ తాను నివసిస్తోన్న బిల్డింగ్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని కరుమత్తంపట్టీలో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నమ్మక్కల్ జిల్లాకు చెందిన ఎం.గంగాదేవి(22) కాగ్నిజెంట్ టెక్నాలజీలో సర్వీసెస్లో టెస్ట్ ఆపరేటర్గా పనిచేస్తోంది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి కోయంబత్తూరులోని కోవిల్ పలాయం ప్రాంతంలోని KGISL ప్లాటినా అనే అపార్ట్మెంట్లో ఉంటోంది.
ఆదివారం సాయంత్రం బెంగుళూరులో ఉంటే తన స్నేహితురాలితో మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఫోన్ పెట్టేసిన మరుక్షణమే తానుంటున్న అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న కోవిల్ పలాయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంగాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి నమ్మక్కల్లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గంగాదేవి ఆత్మహత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఆత్మహత్య అనంతరం మృతురాలి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు మాట్లాడిన స్నేహితురాలిని అదుపులోకి విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.