రింగ్టోన్గా అంబేద్కర్ పాట: దళితుడిని బీరు సీసాతో కొట్టి చంపారు
ముంబై: భారతరత్న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ పాటని రింగ్టోన్గా పెట్టుకున్నందుకు ఓ దళితుడిని హతమార్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షిరిడిలో చోటు చేసుకుంది. షిర్డిలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న సాగర్ షేజ్వాల్ బంధువుల పెళ్లి కోసం ఇంటికి వెళ్లాడు.
తన ఇద్దరు సోదరులతో కలిసి మే 16 తారీఖున అర్ధరాత్రి 1.30 గంటలకు మద్యం దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో అంబేద్కర్ రింగ్టోన్తో సాగర్ షేజ్వాల్ ఫోన్ మోగింది. ఆ పక్కనే ఒక టేబుల్ వద్ద కూర్చొన్న ఎనిమిది మంది యువకులు ఫోన్ స్విచాప్ చేయమని సాగర్ షేజ్వాల్ను కోరారు.
పదే పదే సాగర్ షేజ్వాల్ ఫోన్ రింగ్ అవడంతో ఓపిక నశించిపోయి, సాగర్ని బీరు సీసాతో కొట్టి, షాపులోంచి బయటకు ఈడ్చుకొచ్చారు. కొంచెం సేపటి తర్వాత కొట్టుకుంటూ బైక్పై ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్లి చంపేశారు.
ఈ ఘటన మద్యం షాపులో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఫుటేజ్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున సాగర్ మృతదేహాన్ని సమీపంలోని రుయ్ గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తీవ్రగాయాలతో రాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో సాగర్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో నలుగురు పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు మరాఠా కులానికి చెందిన వాడు కాగా, మిగిలిన వారు ఓబీసీ కులాలకు చెందిన వారుగా గుర్తించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.