YSRCP: పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.. కానీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి!
న్యూఢిల్లీ: ఊహించిన ఘటనే చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభలో వైఎస్ఆర్సీపీకి చెందిన 22 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సారి రాజ్యసభలో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది. ఈ బిల్లుపై పార్టీ వైఖరేమిటన్నది ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో కొనసాగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని అంశాలు అత్యంత వివాదాలకు దారి తీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని సవరించుకోవడానికి అధికార పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా అంశాలను తాము లిఖితపూరకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వస్తామని అన్నారు.

ఆయా వివాదాస్పద అంశాలపై సానుకూలంగా వ్యవహరించాలని విజయసాయి రెడ్డి అధికార పార్టీకి విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. యధాతథంగా అమలు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని తాము అంచనా వేస్తున్నామని అన్నారు. దీనిపై తాము క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సైతం సేకరించినట్లు చెప్పారు. ముస్లింలకు సంతృప్తి పరిచేలా బిల్లులో మార్పులు చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరే దిశగా అడుగులు వేస్తోందంటూ వార్తలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో..పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించడం మరోసారి అలాంటి చర్చకే తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవంక- మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడం, దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టిన నేపథ్యంలో.. వైసీపీ సానుకూలంగా వ్యవహరించడం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications