100 రోజులుగా కరోనా కేసులు నిల్ - న్యూజిలాండ్ అరుదైన ఘనత - ఎలా సాధించారు?
భూగోళాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి గడిచిన ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైన వేళ.. ఒకే ఒక్క దేశం ప్రశాంతంగా మనగలుగుతున్నది. గడిచిన 100 రోజులుగా అక్కడ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. అవును. కరోనా పడగనీడలో అగ్రరాజ్యాలే అతలాకుతలం అవుతుండగా చిన్నదేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది.
చైనా అధ్యక్షుడిపై షాకింగ్ వీడియో - జిన్+హిట్లర్=జిన్ట్లర్ - అచ్చంగా అవే స్ట్రాటజీలు - డ్రాగన్ ఫైర్
న్యూజిలాండ్ లో ఫిబ్రవరి 26న మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ వెంటనే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం.. కట్టుదిట్టమైన చర్యలతో కేవలం 65 రోజుల్లోనే కరోనాపై విజయం సాధించింది. మే1న అక్కడ చిట్టచివరి కేసు వెలుగులోకి వచ్చింది. ఆదివారం నాటికి లోకల్ కేసులు లేకుండా 100 రోజులు పూర్తయింది. న్యూజిలాండ్ లో మొత్తం 1569 కేసులు నమోదుకాగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి 23 యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ వాళ్లంతా విదేశాల నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం.
కరోనా కేసులు లేకుండా 100 రోజులు పూర్తయిన సందర్భంగా దేశంలో చిన్నపాటి సంబురాలు జరిగాయి. కట్టుదిట్టమైన చర్యల వల్లే కరోనా కంట్రోల్ అయిందని, అందుకోసం మూడు విధానాలను అమలు చేశామని, అవి, 1.సరిహద్దుల్ని పూర్తిగా నియంత్రించడం, 2.కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కట్టడికి లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ పక్కాగా అమలు చేయడం, 3.కరోనా టెస్టులు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ ను కచ్చితంగా అమలు చేశామని హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్ఫీల్డ్ తెలిపారు.
కరోనా కట్టడిలో సక్సెస్ అయిన ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తదుపరి ఎన్నికల కోసం ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అక్కడి భారతీయ ఓటర్లలో తన పట్ల ఉన్న సానుకూలతను మరింత పెంచుకునేలా కీలక చర్యలకు ఉపక్రమించారు. శనివారం ఆక్లాండ్లోని రాధా క్రిషన్ ఆలయాన్ని న్యూజిలాండ్ ప్రధాని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రసాదంగా ఇచ్చిన పూరీ చోలేను తిని సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ లో సెప్టెంబరులో ఎన్నికలు జరుగనుండగా, జెసిండా నేతృత్వంలోని లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు పేర్కొన్నాయి.