ఆకలి వైరస్ : నిముషానికి 11 చావులు, ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు : ఆక్స్ ఫాం సంస్థ షాకింగ్ నివేదిక
ప్రపంచం ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోందని మీకు తెలుసా ? ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని మీకు తెలుసా ? ప్రతి నిమిషానికి 11మంది ఆకలి తట్టుకోలేక తినడానికి తిండి లేక చనిపోతున్నారు అని మీకు తెలుసా ? కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరంగా ఆకలి బాధ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నదని మీకు తెలుసా? ఆహారాన్ని వృధా చేస్తున్న ఎంతో మందికి ఈ విషయం తెలియక పోవచ్చు. కానీ తాజాగా "ఆకలి వైరస్ రెట్టింపవుతుంది" పేరుతో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ఆకలికేకలను కళ్లకు కట్టినట్టుగా చెబుతోంది.

నిముషానికి 11 మంది ఆకలికి బలి
ప్రతి నిమిషం 11 మంది ఆకలితో చనిపోతున్నారని, ప్రపంచవ్యాప్తంగా కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఆరు రెట్లు పెరిగిందని పేదరిక నిర్మూలన సంస్థ ఆక్స్ ఫాం తన నివేదికలో వెల్లడించింది. " ఆకలి వైరస్ రెట్టింపవుతుంది" అనే పేరుతో ఒక నివేదికలో, ఆక్స్ ఫాం ఆకలి కారణంగా మరణించిన వారి సంఖ్య కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా నిమిషానికి ఏడు మంది చనిపోతుంటే , ఆకలి కారణంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది.

155 మిలియన్ల మందికి ఆహార సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు తినటానికి తిండి లేక ఆకలి కేకలు వేస్తున్నారని, అధ్వాన్నమైన ఆహార సంక్షోభ స్థాయిలలో నివసిస్తున్నారని నివేదిక రూపొందించిన బృందం వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 20 మిలియన్లు ఎక్కువ మంది ఆహార సంక్షోభంలో చిక్కుకున్నట్లుగా పేర్కొంది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని నివేదిక స్పష్టం చేసింది.

5,20,000 మందికి పైగా ప్రజల ఆకలి చావులు
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఆర్థిక పతనం, వాతావరణ సంక్షోభంతో కలిసి 5,20,000 మందికి పైగా ప్రజలను ఆకలి చావులకు కారణమైందని నివేదిక పేర్కొంది. చాలా దేశాలు కరోనాతో సతమతమవుతున్నా ఈ సమయంలో కూడా ప్రపంచ సైనిక వ్యయం 51 బిలియన్ డాలర్లు పెరిగిందని ఆక్స్ ఫాం తెలిపింది . ఈ మొత్తం ఐక్యరాజ్యసమితి ఆకలి బాధలు తీర్చడానికి అవసరమైన దాని కంటే కనీసం ఆరు రెట్లు మించిపోయిందని నివేదిక వెల్లడించింది.

తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్న దేశాలు ఇవే
ఈ నివేదిక ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా మరియు యెమెన్లతో సహా అనేక దేశాలను తీవ్ర ఆహార సంక్షోభం ఉన్న దేశాలుగా పేర్కొంది . ఈ దేశాలన్నీ ప్రస్తుతం సంఘర్షణలలో చిక్కుకున్నాయని వెల్లడించింది. కరోనా లాక్డౌన్ లో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ధ సంక్షోభం కూడా ప్రజల ఆకలి చావులకు కారణంగా మారాయి. ఆకలి విపత్తును గుర్తించి సంఘర్షణ ఆపాలని, ప్రజల ఆకలి బాధలు తీర్చడానికి అన్ని దేశాలు కృషి చేయాలని సంస్థ ప్రభుత్వాలను కోరింది.
Recommended Video

లాక్ డౌన్ తోనూ పెరిగిపోయిన ఆహార ధాన్యాల ధరలు .. పేదల పొట్ట కూటి తిప్పలు
ఇదే సమయంలో కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని, దీంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం వరకూ పెరిగాయని నివేదికలో పేర్కొంది. ఏదేమైనా తాజా పరిస్థితులు ప్రపంచ దేశాల్లోని లక్షలాది మంది ప్రజలను ఆహార సంక్షోభంలోకి నెట్టాయని ,ఆకలి చావు నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అన్ని దేశాల ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications