కరోనా: ట్రంప్ సభల్లో 30వేల మందికి వైరస్ -అందులో 700 మృతి - యూఎస్లో కొత్తగా 72వేల కేసులు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలు జరుగుతోన్న అగ్ర రాజ్యం అమెరికాలో గత 11 నెలల రికార్డును బద్దలు కొడుతూ మొన్న శుక్రవారం అచ్చంగా లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా అధికారులు తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం శనివారం కొత్తగా మరో 72వేల కేసులు వచ్చాయి. రెండోసారి కరోనా విజృంభణలో అధ్యక్షుడు ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది.
అమెరికాలో తాజాగా నమోదవుతోన్న కొత్త కేసుల వైనంపై రీసెర్చర్లు అధ్యయనం చేయగా.. వైరస్ వ్యాప్తికి ట్రంప్ ప్రచార సభలు కూడా కారణమని తేలింది. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 దాకా ట్రంప్ నిర్వహించిన 18 భారీ సభల్లో మొత్తం 30వేల మంది ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తేలింది. అందులో ఏకంగా 700 మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్రంప్ ప్రచారం నిర్వహిస్తోన్న ప్రాంతాల్లో కేసుల పరిశీలన ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించగలిగామని రీసెర్చర్లు చెప్పారు. ట్రంప్ సభల తర్వాత ఆయా కౌంటీల్లో కొత్త కేసులు ఒక్కసారిగా పెరిగాయని, మాస్కులు ధరించకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, కనీసం శానిటైజేషన్ కూడా చేయకపోవడం వల్ల ట్రంప్ సభల్లో కరోనా వైరస్ విజృంభించినట్లు తెలిపారు.
ట్రంప్ 18 సభల్లో 30వేల మంది కరోనా బారిన పడటం, అందులో 700 మంది చనిపోయినట్లు వచ్చిన రిపోర్టులను జోబెడెన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ''అధ్యక్షుడు ట్రంప్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. కనీసం తన అనుచరులైన రిపబ్లికన్ల ప్రాణాలకు కూడా ఆయన విలువ ఇవ్వరు''అని బైడెన్ మండిపడ్డారు.
అమెరికాలో శుక్రవారం కొత్తగా లక్ష కేసులు, శనివారం 72 వేల కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.4లక్షలకు పెరిగింది. మరణాల సంఖ్య 2.36లక్షలకు చేరింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4.6కోట్లకు, మరణాల సంఖ్య 12లక్షలకు పెరిగాయి. 2020 అమెరికా ఎన్నికల పోలింగ్ మంగళవారం(నవంబర్ 3న) జరగనుంది.