విషాదం మిగిల్చిన మౌంటైన్ మారథాన్-21 మంది రన్నర్స్ మృతి-అదే కారణం...
చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 100కి.మీ మౌంటైన్ మారథాన్ రేసులో పాల్గొన్న 21 మంది అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడ్డారు. పర్వతాలపై మారథాన్ చేస్తున్న క్రమంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో గడ్డకట్టే చలిని తట్టుకోలేక 21 మంది ప్రాణాలు విడిచారు. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్లో ఉన్న బయిన్ నగరంలో శనివారం(మే 22) ఈ ఘటన చోటు చేసుకుంది.
మౌంటైన్ మారథాన్ ఉదయం ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు రన్నర్లు 20కి.మీ నుంచి 31 కి.మీ వరకు పరిగెత్తారు. ఆ సమయానికి సముద్ర మట్టానికి 2వేల మీటర్ల ఎత్తు వరకు చేరుకున్నారు. అదే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు సంభవించాయి. అప్పటిదాకా పొడిగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా చల్లబడింది. వడగండ్ల వానతో ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. దీంతో రన్నర్లు గడ్డకట్టే ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోయారు. మొత్తం 172 మంది పాల్గొన్న మారథాన్లో 21 మంది ప్రాణాలు విడిచారు.
చలి,హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోవడం) కారణంగా 21 మంది రన్నర్లు మృతి చెందినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. మిగతా 151 మందిలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయని... మిగతావారు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. అయితే ఇప్పటికీ కొంతమంది రన్నర్లు మౌంటైన్ పైనే చిక్కుకుపోయి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం.
గన్సు ప్రావిన్స్లోని జింగ్తాయి కౌంటీలో ప్రతీ నాలుగేళ్లకోసారి 100కి.మీ మౌంటైన్ మారథాన్ జరుగుతుంటుంది. ఆరోగ్యకర జీవిన విధానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మారథాన్ నిర్వహించినప్పటికీ అది విషాదాంతమైంది. ఈ ఘటన పట్ల ఈవెంట్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. ఈ ఘటనపై ఒక విచారణ బృందంతో దర్యాప్తు జరిపిస్తున్నామని గన్సు ప్రావిన్స్ ప్రభుత్వం వెల్లడించింది.