ఆ ఐసిస్ ఉగ్రవాది బరువు 250 కేజీలు: తరలించడానికి నానా తంటాలు: మినీ ట్రక్కు కూడా సరిపోలేదు..!
బాగ్దాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్కు చెందిన ఓ ఉగ్రవాది.. భద్రతా బలగాలకు భారీ సవాల్ను విసిరాడు. అతని పేరు ముఫ్తీ అబుల్ అబ్దుల్ బారీ. అతని బరువు 250 కేజీలు. భద్రతా బలగాలు అతణ్ని అదుపులోకి తీసుకోగలిగాయి గానీ.. తరలించడంలో సవాళ్లను ఎదుర్కొన్నారు. అతణ్ని తరలించడానికి తాము వెంట తెచ్చుకున్న మిని ట్రక్కు కూడా సరిపోలేదు. ట్రక్కు లోకి ఎక్కించడానికి భద్రతా బలగాలకు తలప్రాణం తోకలోకి వచ్చింది. తీరా అందులోకి ఎక్కించిన తరువాత.. కదల్లేకపోయిందా ట్రక్కు.
ఇరాక్లోని మోసుల్లో చోటు చేసుకున్న ఘటన ఇది. మోసుల్పై దాడులను చేసిన సందర్భంగా ఇరాక్కు చెందిన స్వాత్ భద్రతా బలగాలు అబు అబ్దుల్ బారీని అదుపులోకి తీసుకున్నాయి. ఐసిస్ జిహాదీ గ్రూప్నకు చెందిన ఉగ్రవాది అతను. ఆత్మాహూతి దాడుల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని మానసికంగా బలోపేతం చేయడం అతని విధి. భద్రతా బలగాలపై దాడులు చేయడానికి ఆత్మాహూతి దళ సభ్యులకు దిశానిర్దేశం చేసేలా ఉపన్యాసాలు ఇవ్వడం అతని హాబీ.
భద్రతా బలగాలపై ఆత్మహూతి దాడులు చేసేలా ఫత్వాలను సైతం జారీ చేస్తుంటాడట. తాను ఇళ్లు కదల్లేకపోయినప్పటికీ.. ఆత్మాహూతి దళ సభ్యులను తన వద్దకే రప్పించుకుని, వారిని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడంలో దిట్టగా గుర్తింపు పొందాడు. మోసుల్లోని ఓ ఇంట్లో కదల్లేని స్థితిలో కనిపించిన అతణ్ని బంధించాయి. అనంతరం మోసుల్ నుంచి బాగ్దాద్కు అతణ్ని తరలించడానికి తాము వెంట తెచ్చుకున్న వాహనాలేవీ సరిపోలేదు.
దీనితో ఓ మినీ ట్రక్కును తీసుకొచ్చారు. అందులోకి అబ్దుల్ బారీని ఎక్కించడం కూడా ప్రహసనంగా మారింది వారికి. అబ్డుల్ స్వయంగా ట్రక్కును ఎక్కలేకపోవడంతో ఏకంగా ఓ క్రేన్ను తీసుకొచ్చారు. దాని ద్వారా అతణ్ని ట్రక్కులోకి ఎక్కించినప్పటికీ.. అది కదల్లేక మొరాయించింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అబ్దుల్ బారీని తరలించడానికి వినియోగించిన ట్రక్కు సహా స్వాత్ భద్రతా బలగాలతో కూడిన ఈ ఫొటోను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది.