ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్కు స్వేచ్ఛ
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ మరింత స్వేచ్ఛనిచ్చింది. జమాత్ ఉద్ దవా నేత సయీద్ను విడుదల చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం హఫీజ్ గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పెంచాలని పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం కోరింది. కానీ లాహోర్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన జ్యుడిషియల్ రివ్యూ బోర్డు అంగీకరించలేదు. హఫీజ్పై నిర్బంధాన్ని గత నెలలో 30 రోజులపాటు ఈ బోర్డు పొడిగించిన సంగతి తెలిసిందే.
జనవరి 31న హఫీజ్ సయీద్తోపాటు అతని నలుగురు అనుచరులను పంజాబ్ ప్రభుత్వం నిర్బంధించింది. యాంటీ టెర్రరిజం యాక్ట్, 1997 చట్టంలోని నాలుగో షెడ్యూలు ప్రకారం 90 రోజుల నిర్బంధం విధించింది.
అయితే ప్రజా భద్రత చట్టం ప్రకారం రెండుసార్లు ఈ నిర్బంధాన్ని పొడిగించారు. హఫీజ్ నలుగురు అనుచరులపై నిర్బంధాన్ని పొడిగించేందుకు కోర్టు నిరాకరించడంతో వారిని అక్టోబరులోనే విడుదల చేశారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో 164 మంది మరణించారు. హఫీజ్ సయీద్ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.