ఆత్మాహుతికి పాల్పడ్డ అమ్మాయిలు: 30మంది మృతి
బావుచి: నైజీరియాలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మాహుతి బాంబర్లుగా మారి తమను తాము పేల్చివేసుకోవడంతో 30మంది దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన మైదుగురిలో అత్యంత రద్దీగా ఉన్న ఒక మసీదు వద్ద ఈ పేలుళ్లు జరిగాయి.
బోకోహరాం ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకున్న ఈ నగరంలో జూన్ నెలలోనే ఇది నాలుగవ ఆత్మాహుతి దాడి. రంజాన్ సందర్భంగా మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని ప్రజలు బయటికి వస్తున్న సమయంలో ఒక బాలిక తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
మరో బాలిక పారిపోయే ప్రయత్నంలో తాను పేల్చివేసుకుందని తెలిపారు. రెండో పేలుడులో ఆత్మాహుతి బాంబరు మాత్రమే చనిపోయింది. క్షతగాత్రులకు సేవలందించే సమయంలో 30 మంది చనిపోయి ఉండటాన్ని గమనించానని భద్రతా సిబ్బంది ఒకరు తెలిపారు.
అనేక మంది గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బోకో హరాం ఉగ్రవాదులు వేల సంఖ్యలో బాలికలను, మహిళలను కిడ్నాప్ చేసి, వారిని ఆత్మాహుతి బాంబర్లుగా వాడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గత గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 40మంది ప్రజలు మరణించారు.