కూలిన ఎస్ఆర్-20 విమానం: నలుగురి మృతి
న్యూయార్క్: విమానం కూలి నలుగురు మృతిచెందిన ఘటన అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ అక్తర్కి చెందిన ఎస్ఆర్-20 అనే సింగిల్ ఇంజిన్ విమానం హ్యూస్టన్లోని డేవిడ్ వేన్ హుక్స్ విమానాశ్రయం నుంచి బయలుదేరి నవాసోటా ప్రాంతంలో కూలిపోయింది.
ఈ విమానంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఏఏ(ఫెడరల్ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
బాగ్దాద్ మార్కెట్లో ఆత్మాహుతి దాడి
బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు ఆదివారం వేర్వేరుచోట్ల బాంబుదాడులకు దిగారు. తూర్పు బాగ్దాద్లోని బహిరంగ మార్కెట్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 38 మంది మృతిచెందగా 62 మంది గాయపడ్డారు.
సదర్నగర పరిధిలోని షియాలు అధికంగా ఉండే మ్రేది మార్కెట్లో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి సభ్యుడు తననుతాను పేల్చుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.