అమెరికా రక్త చరిత్ర: అబ్రహం లింకన్, జేఎఫ్కే సహా
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల ర్యాలీలో..
అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు.

అమెరికా రక్తచరిత్ర..
ఈ ఉదంతం.. అమెరికా రక్త చరిత్రను మరోసారి గుర్తు చేసింది. తుపాకీ విష సంస్కృతికి అద్దం పట్టింది. వంద సంవత్సరాలు దాటినా.. అక్కడి గన్ కల్చర్కు తెర పడలేదు. పైగా ఇంకా పెచ్చరిల్లుతూనే వస్తోందనడానికి తాజా ఉదాహరణే ఈ ఘటన. బుల్లెట్లకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అధ్యక్షులు బలి అయ్యారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తొలి అధ్యక్షుడు ఆయనే..
అమెరికాలో కాల్చివేత గురైన తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 15వ తేదీన హత్యకు గురయ్యారు. తన భార్య మేరీ టాడ్ లింకన్తో కలిసి వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో అవర్ అమెరికన్ కజిన్ అనే కామెడీ షోనకు హాజరైనప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లింకన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు కన్నుమూశారు.
ఆరు నెలల్లోనే..
మరో అధ్యక్షుడు జేమ్స్ గ్యారీఫీల్డ్ కూడా హత్యకు గురయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోనే ఈ ఘటన సంభవించింది. 1881 జులై 2వ తేదీన న్యూ ఇంగ్లండ్కు బయలుదేరి వెళ్లడానికి వాషింగ్టన్ రైల్వేస్టేషన్కు చేరుకున్నప్పుడు ఛార్లెస్ గిటో అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడ్డ కొన్ని వారాల తరువాత ఆయన కన్నుమూశారు.

తుపాకీ గుళ్లకు బలి..
అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్కే హత్యకు గురయ్యారు. 1901 సెప్టెంబర్ 6వ తేదీన న్యూయార్క్ బఫెలోలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై పాయింట్ బ్లాంక్ రేజ్లో కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో గాయపడ్డ మెక్కే సెప్టెంబర్ 14వ తేదీన తుదిశ్వాస విడిచారు.
జాన్ ఎఫ్ కెన్నెడీ..
అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురయ్యారు. 1963 నవంబర్లో తన భార్య జాక్వెలిన్ కెన్నెడీతో కలిసి డల్లాస్ను సందర్శించినప్పుడు ఆయన కారుపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జేఎఫ్కే.. పార్క్ల్యాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.












Click it and Unblock the Notifications