సహజీవనం చేస్తే ఆరునెలల జైలుశిక్ష; వివాహేతర సంబంధానికి ఏడాది జైలు!!
ఇద్దరికీ ఇష్టమైనప్పుడు సహజీవనం చేయడంలో తప్పు లేదని అనేక దేశాలలో చట్టాలు చెబుతున్నా, కొన్ని దేశాలు సహజీవనం చేయడం నేరంగా పరిగణిస్తూ దానికి శిక్షలను కూడా ఖరారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇండోనేషియా దేశంలోనూ అటువంటి అనేక కీలక చట్టాలను తెచ్చారు.
సహజీవనం వివాహేతర సంబంధాల వంటివాటిని నేరంగా పరిగణిస్తూ ఇండోనేషియా దేశంలో చట్టంలో మార్పులు చేశారు. ఈ మేరకు నవంబరు నెలలో తుది రూపం ఇచ్చిన వివాదాస్పద నేర శిక్షా స్మృతి సవరణ బిల్లును నిన్న ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక ఈ సవరించిన బిల్లు ప్రకారం సహజీవనం నేరం గా పరిగణించబడుతుంది. ఇక సహజీవనం చేసిన వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. ఎవరైనా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడుతుంది.
పొరపాటున వేరే వ్యక్తితో ఎవరైనా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటే, దానిపై సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తల్లి, తండ్రి, భార్య, భర్త, లేదా పిల్లలు ఎవరు ఫిర్యాదు చేసినా ఖచ్చితంగా కేసు నమోదు చేయబడుతుంది. ఇక ఇవి మాత్రమే కాకుండా ఇండోనేషియాలో అనేక నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఇండోనేషియా కు వచ్చే పర్యాటకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
అబార్షన్ చేయించుకోవడం, దైవ దూషణలకు పాల్పడడం ఇకపై ఇండోనేషియాలో నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఆపని చేస్తే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. అంతేకాదు అక్కడ దేశాధ్యక్షుడిని , దేశ ఉపాధ్యక్షుడిని గాని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను గాని విమర్శించడాన్ని నిషేధించారు. ఇక తనపై విమర్శలను నేరుగా దేశ అధ్యక్షుడు ఫిర్యాదు చేస్తే నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతే కాదు అక్కడ కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తే కూడా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది అని అనేక నిబంధనలు తీసుకువచ్చారు. అయితే ఈ నిబంధనలతో భావప్రకటన స్వేచ్ఛ హరించబడుతుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.