వెనిజులా జైల్లో ఘోరం: మంటల్లో 68మంది మృతి
కరాకస్: వెనిజులాలోని కారాబోబో రాష్ట్రంలోని జైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెనిజులా పోలీసుశాఖ ఆధ్వర్యంలోని జైలు నుంచి తప్పించుకునేందుకు కొంతమంది చేసిన ప్రయత్నంలో భాగంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 68 మంది మృత్యువాత పడ్డారు.
దేశంలోని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం, వారికి కనీస వసతులు కల్పించకపోవడంతో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఆహార కొరత, వ్యాధుల బారిన పడటం, దుర్భరమైన పరిస్థితుల కారణంగా ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు వారాల క్రితం కూడా మార్గరిటా దీవుల నుంచి 58 మంది ఖైదీలు తప్పించుకున్నారు. తాజాగా, కారాబోబో స్టేట్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో జరిగిన ఈ దారుణమైన ఘటనపై నిజనిర్ధారణ కోసం నలుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్టు చీఫ్ ప్రాసిక్యూటర్ టారెక్ విలియమ్ సాబ్ బుధవారం రాత్రి తెలిపారు.
జైలు నుంచి తప్పించుకునేందుకు కొంతమంది దుప్పట్లకు నిప్పుపెట్టారని, ఓ గార్డు వద్ద తుపాకీని దొంగిలించారని జైలు అధికారులు తెలిపా రు. మంటలు భారీగా చెలరేగడంతో కాలిన గాయాలతో కొంతమంది చనిపోగా.. పొగతో ఊపిరాడక మరికొంతమంది చనిపోయారు. అదే సమయంలో జైలు సందర్శనకు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా మంటల్లో చిక్కుకుని చనిపోయినట్టు భావిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై కారాబోబో స్టేట్ గవర్నర్ రాఫెల్ లకావా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాగా, ఖైదీల బంధువులు కారాబోబో పోలీస్ హెడ్క్వార్టర్స్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఖైదీల బంధువుల రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో వారంతా చెల్లాచెదురయ్యారు.