ముంబై 26/11 దాడులు: పాక్ నుంచి నగదు బదిలి
ఇస్లామాబాద్: ముంబై లో 2008 నవంబర్ 26న జరిగిన మారణహోమానికి పాక్ భారీ మొత్తంలో నగదు బదిలి చేసిందని వెలుగు చూసింది. ఓ బ్యాంకు ఉద్యోగి పాకిస్థాన్ నుంచి భారత్ కు భారీ మొత్తంలో నగదు బదిలి అయ్యిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలను పాక్ ప్రత్యేక కోర్టు ముందు పెట్టాడు.
ఆ నగదుతోనే 26/11 మారణహోమం జరిగిందని అంటున్నారు. ముంబై మారణహోమం జరగడానికి కొద్ది రోజుల ముందు ఈ కేసులోని ఓ ప్రధాన నిందితుడి ఖాతాలో నుంచి భారీ మొత్తంలో నగదు బదిలి చేశామని బ్యాంకు ఉద్యోగి బుధవారం కోర్టు ముందు సాక్ష్యం చెప్పాడు.
ముంబై 26/11 దాడుల కేసు విచారణ పాకిస్థాన్ లోని రావల్పిండిలోని ఆడియాల జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మద్య జరుగుతున్నది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు పాకిస్థాన్ ఏటీసీ కోర్టు ముందు సాక్ష్యం చెబుతున్నారు.
ముంబై మారణహోమం కేసులో పాక్ చెందిన మాస్టర్ మైండ్ లఖ్వీ, ఆపరేషన్ కమాండర్ జకి-ఉర్- రెహమాన్ లఖ్వీ, అబ్దుల్ వాజీద్, మజర్ ఇక్బాల్, సాధిక్, సాహిద్ జమీల్, జమీల్ అహమ్మద్, యూనస్ అంజుమ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.
2009లో పాక్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులోని నిందితుడు సాహిద్ జమీల్ అకౌంట్ నుంచి భారత్ కు భారీ మొత్తంలో నగదు బదిలి అయ్యిందని బ్యాంకు ఉద్యోగి రికార్డులతో సహా కోర్టు ముందు పెట్టాడు. పాక్ ఏటీసీ కోర్టు ఈ కేసును నవంబర్ 4వ తేదికి వాయిదా వేసింది.