Afghanistan : ఆఫ్గనిస్తాన్లో ఆగని తాలిబన్ అరాచకాలు-మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడు హతం...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడైన అమృల్లా సలెహ్ తమ్ముడు రోహుల్లా సలెహ్ని తాలిబన్లు హతమార్చారు. పంజ్షీర్ వ్యాలీలో గురువారం(సెప్టెంబర్ 8) రాత్రి రోహుల్లాను గుర్తించిన తాలిబన్లు... అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య గావించారు. ఇటీవలే పంజ్షీర్ వ్యాలీని పూర్తిగా ఆక్రమించుకున్నట్లు తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజ్షీర్ నాయకుడు అహ్మద్ మసౌద్ మాత్రం తాలిబన్ ప్రకటనను ఖండించారు. పోరాటం కొనసాగుతోందని... తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని తెలిపారు.
పంజ్షీర్పై తాలిబన్ల దండయాత్రతో అమృల్లా సలేహ్,అహ్మద్ మసౌద్ తజికిస్తాన్కు పారిపోయినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో నిజం లేదని ఆఫ్గనిస్తాన్ గత ప్రభుత్వంలో తజికిస్తాన్లో రాయబారిగా వ్యవహరించిన జహీర్ అగ్బర్ తెలిపారు. ఆ ఇద్దరితో తాను టచ్లో ఉన్నానని... ఇద్దరూ పంజ్షీర్లోనే ఉన్నారని స్పష్టం చేశారు.
ఆఫ్గనిస్తాన్లో ఒక్క పంజ్షీర్ మాత్రమే తమ ఆధీనంలోకి రావట్లేదనే అసంతృప్తి నిన్నటిదాకా తాలిబన్లను వెంటాడింది. ఇటీవల పంజ్షీర్పై విజయం సాధించినట్లు తాలిబన్ ఫైటర్లు ప్రకటించడంతో ఆ ఒక్క అసంతృప్తి కూడా సమసిపోయింది. అయితే ఇప్పటికీ పంజ్షీర్లో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. పంజ్షీర్ను నిజంగానే తాలిబన్లు జయించారా... లేక అందరి దృష్టి మరల్చేందుకే ఆ ప్రకటన చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్లో 33 మంది మంత్రులతో ఆపద్దర్మ ప్రభుత్వాన్ని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది ఐరాస భద్రతా మండలి టెర్రరిజం బ్లాక్ లిస్టులో ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాద మతతత్వ నేపథ్యమే వీరిని మంత్రులను చేసింది. తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు,గ్రూపులకు చోటు కల్పిస్తామని మొదట వారు హామీ ఇచ్చారు. కానీ మంత్రుల జాబితాను గమనిస్తే ఆ మాటను వారు నిలబెట్టుకోలేదు. ఉగ్రవాద నేపథ్యం ఉన్నవారు తప్పితే ఇతర వర్గాలెవరికీ పదవులు దక్కలేదు.
కేబినెట్లో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదు. ప్రభుత్వంలో మహిళలకూ ప్రాతినిధ్యం ఉండాలని ఓవైపు వందలాది మంది మహిళలు నిరసనలు తెలియజేస్తున్నా... తాలిబన్లకు అవేవీ పట్టలేదు. నిజానికి ఆఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న కొద్దిరోజులకే తాలిబన్లు ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక దేశంలో ప్రజాస్వామ్యానికి తావు లేదు... అంతా షరియా చట్టాల ప్రకారమే నడుస్తుందని. అందుకు తగినట్లుగానే వారి చర్యలు కనిపిస్తున్నాయి.
తాలిబన్ల మొదటి ప్రెస్ మీట్లో వారి మాటలు కొంత ఉదారంగా,వారిలో మార్పు వచ్చిందన్నట్లుగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. షరియా చట్టాలను కఠినంగా అమలుచేసే యోచనలో తాలిబన్లు ఉన్నారు. అదే జరిగితే ఆఫ్గనిస్తాన్లో మానవ హక్కులు... ముఖ్యంగా స్త్రీలకు హక్కులు అనే మాటే వినిపించదు. ప్రజాస్వామ్య గొంతుకలకు తావు ఉండదు. ఈ పరిణామాలన్నీ సగటు ఆఫ్గనిస్తానీని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.