ప్రపంచ శాంతికి విఘాతంగా రాడికలైజేషన్: ఆప్ఘనిస్థానే రుజువంటూ ఎస్సీవో మీట్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తజకిస్థాన్ రాజధాని దుషన్బేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-(ఎస్సీవో) సమావేశంలో నరేంద్ర మోడీ వర్చవల్గా పాల్గొని ప్రసంగించారు. ఆప్ఘనిస్థాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాల శాంతికి అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. శాంతిభద్రలతో దేశాల మధ్య నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో తీవ్రవాదం పెద్ద సమస్యగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్లో నెలకొన్న పరిణామాలు తీవ్రవాదాన్ని బలపరిచేలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను నిలువరించాలన్నారు. ఎస్సీవోలో కొత్తగా చేరుతున్న ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్టు, కతర్ దేశాలకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు.
గత కొన్నేళ్లుగా భారత్ పోరాడుతున్న ప్రాంతీయ స్థిరత్వంపైనా ప్రధాని మోడీ మాట్లాడారు. దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలపై కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని చైనా, పాకిస్థాన్తో సహా మిగిలిన సభ్య దేశాలను కోరారు. ఇరవై ఏళ్ల తర్వాత ఆప్ఘాన్ నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని తెలిపారు.
అయితే, పాకిస్థాన్, చైనా దేశాలు తాలిబన్ల పాలనలో పాలుపంచుకుంటున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. గతంలో ఆప్ఘనిస్థాన్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్ చేపట్టిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఆప్ఘాన్ను ఉపయోగించుకుని పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో జమ్మూకాశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా అనేవి కూడా ప్రపంచంలో అతిపెద్ద సమస్యలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలిసికట్టుగా వీటిని అధిగమించాలని పిలుపునిచ్చారు.
ఇది ఇలావుండగా, ఆఫ్గనిస్థాన్లో తాలిబన్ల రాజ్య స్థాపనతో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు చేసినవారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఉద్యోగ,ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కడుపు నింపుకునేందుకు ఇళ్లల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటున్నారు.టోలో న్యూస్ కథనం ప్రకారం... చాలామంది కాబూల్ వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. ఎంతో కొంతకు వాటిని విక్రయిస్తున్నారు.ఆ పూటకు తిండి దొరికితే చాలు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షాపుల్లో వస్తువులను కొనేవారు కరువవడంతో ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాల్ గుల్ అనే ఓ షాపు యజమాని మాట్లాడుతూ... 'నా షాపులో వస్తువులను సగం ధరం కన్నా తక్కువకే విక్రయించాను. 25ఆఫ్గనీలు పెట్టి కొన్న ఫ్రిజ్ను 5వేల ఆఫ్గనీలకే అమ్ముకోవాల్సి వచ్చింది. తప్పదు నా పిల్లలకు తిండి పెట్టాలి.' అని వాపోయాడు. కొంతమంది లక్ష ఆఫ్గనీల విలువ చేసే వస్తువులను సైతం కేవలం 20వేల ఆఫ్గనీలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కాబూల్ వీధుల్లో ఎక్కడ చూసినా... జనం ఫ్రిజ్లు,టీవీలు,సోఫాలు,కప్బోర్డులు,ఫర్నీచర్,ఇలా ఏదో ఒకటి విక్రయించేవాళ్లు కనిపిస్తున్నారు.
మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ అఘా మాట్లాడుతూ... గత 10 రోజులుగా తానూ స్థానిక మార్కెట్లో వస్తువులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్గన్ ప్రభుత్వం తనకు రావాల్సిన వేతనాన్ని చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఉన్నపళంగా ఉద్యోగం పోయి రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు.ఆఫ్గన్ పెను సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తాలిబన్లు అధికారంలోకి రాకముందు దేశంలో 72శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు 97శాతానికి పెరిగిందని ఐరాస పేర్కొంది. రాను రాను ఆహార సంక్షోభం తలెత్తుతుందని... ప్రజలు ఆకలి చావులతో చనిపోయే దుస్థితి తలెత్తవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.