క్రూరత్వం: బతికుండానే కళ్లు పీకి, చర్మం వలిచారు
కాబూల్: తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి తమ రాక్షసత్వాన్ని ప్రపంచానికి చూపించారు. తాము అపహరించిన ఓ వ్యక్తిని బతికుండానే చిత్రహింసలకు గురిచేసి దారుణంగా చంపేశారు. బతికున్న బందీ చర్మాన్ని కత్తులతో వలిచేసి, కళ్లు పీకేసిన తాలిబన్ ఉగ్రవాదులు.. ఐఎస్ ఉగ్రవాదుల కిరాతక నైజానికి తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు.
గత డిసెంబర్లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే... పాకిస్థాన్లో పురుడుపోసుకున్న తాలిబన్ ఉగ్రవాదులు ఆ తర్వాత పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్కూ విస్తరించారు. ఆఫ్ఘన్లోని ఘోర్ ప్రావిన్స్కు చెందిన ఫజల్ అహ్మద్(21) అనే యువకుడు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా, అహ్మద్ బంధువర్గానికి చెందిన కొందరు ఓ తాలిబన్ కమాండర్ను చంపేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ఓ రోజు అహ్మద్ను అతడి ఇంటికి బయటకు ఈడ్చుకొచ్చిన తాలిబన్ ఉగ్రవాదులు.. అత్యంత పాశవికంగా అతడి కళ్లను పీకేశారు.
అంతటితో ఆగిపోలేదు వారి రాక్షసత్వం. విపరీతమైన బాధతో అతడు పెడబొబ్బలు పెడుతుండగానే అతడి ఛాతీ భాగంలోని చర్మాన్ని ఉగ్రవాదులు వలిచేశారు. దీంతో బతికుండగానే అతడి గుండే బయటకు కనిపించింది. అయినా ఆగలేదు వారి పైశాచికత్వం. ఆ తర్వాత ఉగ్రవాదులు అతడిని పది అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
రోజు రోజుకు తాలిబన్ ఉగ్రవాదుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయని, ఉగ్రవాదులపై పోరాడేందుకు అమెరికా సహకరించాలని ఆఫ్ఘాన్ కోరింది. తాలిబన్లను మట్టుపెట్టేందుకు అమెరికన్ దళాలు తమ సైన్యంతో కలిసి పని చేయాలని పేర్కొంది.