Video: మస్త్ మజా: తాలిబన్లలో ఈ యాంగిల్ కూడా ఉందా: కాబుల్ అమ్యూజ్మెంట్ పార్క్లో
కాబుల్: ప్రపంచ దేశాలను భయాందోళనల్లోకి నెట్టేశారు తాలిబన్లు. ఒక్కసారి తమ దృష్టిని ఆప్ఘనిస్తాన్ వైపు మళ్లించేలా చేశారు. 20 సంవత్సరాల పాటు ఆప్ఘనిస్తాన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అమెరికా సైనిక బలగాలు.. వెనక్కి మళ్లడం ఆరంభమైనప్పటి నుంచీ తాలిబన్ల తమ తడాఖా చూపడం మొదలు పెట్టారు. 20 సంవత్సరాల పాలుగా ఉనికిని కోల్పోయి.. దాదాపుగా అజ్ఙాతంలో గడిపిన తాలిబన్లు.. ఒక్కసారిగా విరుచుకుని పడ్డారు. రోజుల వ్యవధిలో దేశం మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు.
Kabul Airport..శాటిలైట్ ఫొటోలు: ఆఫ్ఘన్ల దుస్థితికి అద్దం
మత ఛాందసవాదానికి మారుపేరు..
ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సమాయాత్తమౌతోన్నారు. తాలిబన్లు అనగానే.. కరడు గట్టిన ఇస్లామిక్ మత ఛాందస భావాలను పుణికి పుచ్చుకున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. 20 ఏళ్ల కిందటి వారి పాలన కళ్ల ముందు కదలాడుతుంది. సంప్రదాయాల కట్టు తప్పిన ఏ ఒక్కరినీ ఉపేక్షించకుండా బహిరంగంగా శిక్షించిన సందర్భాలు గుర్తుకు తెస్తుంటాయి. అలాంటి పరిపాలనను మరోసారి ఆప్ఘనిస్తాన్ ప్రజలు చవి చూడటానికి సిద్ధపడ్డారు. ఆంక్షల మధ్య జీవించడానికి ఇష్టపడని వారు దేశం వదిలి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
మస్తుగా మజా
సంప్రదాయం పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షల మధ్య జీవించడం కంటే చావే నయమనుకునే స్థితిలో ఉన్నారు. దేశం వదిలి వెళ్లడానికి ఆప్ఘనిస్తాన్ ప్రజలు చేస్తోన్న ప్రయత్నాలు.. తాలిబన్ల పట్ల వారిలో పేరుకుని పోయిన భయాందోళనలకు అద్దం పడుతోంది. కాగా- మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లలో మరో కోణం కూడా ఉందనిపించేలా చేసింది ఓ ఘటన. కాబుల్లోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రవేశించిన తాలిబన్లు.. అక్కడ మస్తుగా మజా చేశారు.
చిన్నపిల్లల్లా
దీనికి సంబంధించిన దృశ్యాలతో కూడిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చేతుల్లో మారణాయుధాలతోనే ఆ అమ్యూజ్మెంట్ పార్క్లో తిరుగాడారు. జెయింట్ వీల్లో ఎక్కి కూర్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. సాధారణంగా మనకు అమ్యూజ్మెంట్ పార్కులు, పట్టణాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో కనిపించే ప్లే హార్సెస్ ఎక్కి చిందులు వేశారు. ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎలక్ట్రిక్ బంపర్ కార్లతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ చిన్నపిల్లల్లా మారిపోయారు.
అమ్యూజ్మెంట్ పార్కులో..
రెండు దశాబ్దాల కాలం పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా.. అజ్ఙాతంలో గడిపారు తాలిబన్లు. తమ ఉనికిని సైతం కోల్పోయారు. ఆప్ఘనిస్తాన్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో, తమకు పట్టు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో చోటు చేసుకున్న మార్పుల్లో భాగంగా కాబుల్లో అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటయ్యాయి. ఇందులో తాలిబన్లు తొలిసారిగా ప్రవేశించినట్టు కనిపిస్తోంది. అందుకే- కొత్తగా, కాస్త వింతగా కనిపించిన అమ్యూజ్మెంట్ పార్క్లో ఎలాంటి భేషజాల్లేకుండా ప్రవర్తించారు.
ఒకట్రెండు రోజుల్లో..
ఇదిలావుండగా- కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాలిబన్లు యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధమౌతోన్నారు. ఒకట్రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు తాలిబన్ నేతల్లో కొనసాగుతోన్నాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ఆప్ఘనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. మరోవంక- తాలిబన్ల ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసేలా ప్రపంచ దేశాలు పావులు కదుపుతోన్నాయి. ఐక్యరాజ్య సమితి వేదికగా చర్చలు సాగుతున్నాయి.
ఉగ్రవాదంపైనే..
మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తాలిబన్ల ప్రభుత్వంపై కఠిన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని వివిధ దేశాధినేతలు అభిప్రాయం పడుతున్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించేలా తాలిబన్ల కొత్త ప్రభుత్వానికి ఎలాంటి అవకాశమే ఇవ్వకుండా ఉండేలా చేయాలనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు బలపడితే- ఏ దేశానికి కూడా అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. ఉగ్రవాద ప్రభావం అన్ని దేశాలపైనా కనిపిస్తుందని అంటున్నారు.