ఎయిర్ ఏషియా: 2 నిమిషాల ఆలస్యం.., చేతిలో చెయ్యేసి ప్రయాణీకులు మృతి
ఇండోనేషియా: రెండు నిమిషాలు ముందుగా ఆదేశాలు వచ్చి ఉంటే ఎయిర్ ఏషియాలోని 162 మంది ప్రాణాలు దక్కేవా? అంటే అవునని అంటున్నారు. మలేషియాకు చెందిన విమానం ఎయిర్ ఏషియా క్యూజెడ్8501 జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. రెండు నిమిషాల ఆలస్యం వల్లే విమానం కూలిందని అంటున్నారు.
విమానం పైలట్కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మధ్య జరిగిన సంభాషణ వివరాలు వెల్లడయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేదని, అందువల్ల తాను ఎడమవైపు తిరిగి మరికొంత ఎత్తుకు వెళ్తానని పైలట్ చెప్పారు. అయితే, అందుకు ఏటీసీ అనుమతించడంతో ఏడుమైళ్ల దూరం వెళ్లారు. కానీ మరింత ఎత్తులో వెళ్తానని పైలట్ అడిగారు.
ఆయన 38వేల అడుగుల ఎత్తుకు వెళ్తానని అడిగాడు. ఆ సమయంలో ఆ ఎత్తులో మరో ఆరు విమానాలు ఎగురుతుండటంతో ఏటీసీ నుండి సమాధానం లేుద. దాంతో తప్పనిసరిగా ఎయిర్ ఏషియా విమానం తక్కువ ఎత్తులో ఎగరవలసి వచ్చింది. తీరా ఏటీసీ నుండి సరే.. పైకి వెళ్లమని ఆదేశాలు వచ్చేసరికి రెండు నిమిషాలు గడిచింది. కానీ ఆ ఆదేశాలకు తిరిగి సమాధానం రాలేదు. అప్పటికే ఘోరం జరిగిపోయింది!
చేతులు విడువని ప్రయాణీకులు
మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నామని తెలిసినా ఆ ముగ్గురు ప్రయాణికులు మాత్రం ఒకరినొకరు వదిలిపెట్టలేదు! అంతేకాదు, జావా సముద్ర జలాలపై మృతదేహాలుగా తేలాడున్నా వారి చేతులు మాత్రం విడిపోలేదు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఒకరి చేతులొకరు పట్టుకుని చనిపోయి ఉన్నారు.
ప్రమాదంలో ప్రాణాలను రక్షించుకునే క్రమంలోనే వీరు అలా చేతులు పట్టుకుని ఉంటారన్న భావన వ్యక్తమవుతోంది. మరో మృతదేహం లైఫ్ జాకెట్ ధరించి ఉందని గుర్తించారు. ఈ ఘటనలో మృత్యువాతపడిన వారిలో కొందరి మృతదేహాలు బోర్నియా తీరంలో మంగళవారం కనుగొన్నారు. వీటిలో 40 మృతదేహాలను నిన్నటి వరకు వెలికితీశారు.