'ఇరాక్' బందీల జాడ తెలిసింది, తెలుగువారిపై ఎపి...
వీరిలో పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వెళ్లినవారున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రవాణా సదుపాయాలు లేవన్నారు. ఇరాక్లో ఉన్న భారతీయ అధికారులు బందీలను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యూఎన్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఇరాక్ (యునామీ) వంటి సంస్థలను సంప్రదిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, భారతీయ బందీల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ క్రైసిస్ మేనేజ్మెంట్ బృందంతో గురువారం రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనే విధానాలపై చర్చించారు. భారతీయ బందీలందరినీ క్షేమంగా తీసుకురావడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్నీ వదిలిపెట్టమని ఆమె చెప్పారు. బాధిత కుటుంబసభ్యులతోను ఆమె భేటీ అయ్యారు.
బాధితులను విడిపించేందుకు అంతర్జాతీయ మానవహక్కుల సంఘం, రెడ్క్రాస్ సొసైటీ వంటి సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అలాగే తిక్రిత్లో చిక్కుకుపోయిన 46 మంది నర్సులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఇరాక్లో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు నగదు కానీ ఇతరత్రా డిమాండ్లను నెరవేర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇరాక్లో చిక్కుకున్న ఆంద్రులకు రక్షణ
ఇరాక్లో ఉంటున్న ఆంధ్రుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్లో 24 గంటలూ పనిచేసే హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నవకొట్ల రామారావు, విశాఖకు చెందిన దాడి శ్రీనివాసరావు ఇరాక్లో ఉంటున్నట్లు.. వారు సురక్షితంగానే ఉన్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి సమాచారం వచ్చిందన్నారు.
ఇంకా ఎవరైనా ఇరాక్లో ఉన్నట్లయితే వారి వివరాలను హెల్ప్లైన్ నెంబర్ 040 23454946, 9949054467కు తెలియజేయాలన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రవాసాంద్రుల సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సెల్ ద్వారా విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంద్రుల వివరాలను సేకరిస్తామని చెప్పారు.