భయంతో వణికిన పాకిస్తాన్
Pakistan Earthquake: పొరుగుదేశం పాకిస్తాన్లో పెను భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీని వల్ల ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగివుండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ భూకంప తీవ్రత భారత్లోనూ కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
పాకిస్తాన్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా రికార్డయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:58 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ స్టేషన్ వెల్లడించాయి. 31.25 అక్షాంశం, 70.52 రేఖాంశం వద్ద ఈ ప్రకంపనలు నమోదైనట్లు వివరించాయి.

పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశగా 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోర్ లాల్ ఈసాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరోర్ లాల్ టౌన్ సమీపంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.
కాగా- ఈ విపత్తు వల్ల ఇఫ్పటివరకు ప్రాణ నష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలు అందట్లేదు. ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. కరోర్ లాల్, లెయ్యా, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఫతేపూర్, ఖాజియాబాద్, బస్తీ సర్ఘాని వంటి ప్రాంతాల్లో కొన్ని నివాసాలకు బీటలు ఏర్పడినట్లు సమాచారం.
ముల్తాన్ సిటీపైనా భూకంప ప్రభావం పడింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలు, షాపులను ఖాళీ చేసి దూరంగా పరుగెత్తారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తోండటంతో లోనికి వెళ్లడానికి భయపడ్డారు.
ఈ భూకంప తీవ్రత ఇటు భారత్లోనూ కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, నొయిడా, హర్యానాలోని గుర్గావ్, పంజాబ్, రాజస్థాన్లల్లో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications