పాకిస్తాన్ మళ్లీ ఆలా చేస్తే యుద్ధం తప్పదు: 26/11 ఉగ్రదాడిపై నిపుణులు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ముంబైలో 26/11 లాంటి ఉగ్రవాద దాడికి మరోసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాల్పడితే భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదని అమెరికా, భారత విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2008లో ఈ దాడి జరిగి సోమవారంతో పదేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి దాడి మరోసారి జరిగితే మాత్రం ఆ పరిస్థితి సులువుగా యుద్ధానికి దారి తీస్తుందని భావిస్తున్నారు.
లష్కరే తోయిబాకు చెందిన పదిమంది ఉగ్రవాదులు 2008లో ముంబైలో దాడులు జరిపారు. ఈ దాడిలో పలువురు అమెరికన్లతో పాటు 166 మంది చనిపోయారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని ఆర్మీ మట్టుబెట్టింది. ఈ దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ మాత్రం ప్రాణాలతో చిక్కాడు. ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష పడింది.
దాడులకు హఫీజ్ సయీద్ సూత్రధారిగా భావిస్తున్నారు. అతను పాకిస్తాన్లోనే తలదాడుకుంటున్నాడు. అక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాడు. దాడికి పాల్పడటానికి కారణమైన మాస్టర్ మైండ్ హఫీజ్కు పాకిస్తాన్ అండగా ఉండటంపై భారత్ ఆగ్రహంగా ఉంది.

దీనిపై అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రైడెల్ మాట్లాడుతూ.. 26/11 దాడుల బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని, సూత్రధారికి శిక్షపడలేదని, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్లో ఇది అసంభవంలా కనిపిస్తోందని, ఇలాంటి దాడి మరోసారి భారత్లో జరిగితే ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు.
పాక్లో అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన హుస్సేన్ మాట్లాడుతూ.. భారత్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి ఇటువంటి భీకర దాడికి పాల్పడితే ఆ ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఎవరూ అంచనా వేయలేరని, నాటి దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ మాటిచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలన్నారు.
నాటి ఉగ్రదాడి సమయంలో వైట్ హౌస్లో పని చేసిన అధికారి గోయల్ మాట్లాడుతూ... అప్పుడు భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా ఆపడమే తమ మొదటి ప్రాధాన్యతగా మారిందని, ఇందుకు భారత్, పాకిస్థాన్ నేతలతో పాటు తమ మిత్రదేశాలకు కూడా ఈ విషయంపై ఫోన్లు చేశామని, నాటి ప్రధాని మన్మోహన్పై ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, చాలా నిగ్రహంతో వ్యవహరించారని, ఈ దాడికి ప్రతిదాడి జరపడం సరికాదని భావించారని తాను భావిస్తున్నానని చెప్పారు. కానీ ఆయనపై రాజకీయంగా కూడా ఒత్తిడి పడిందని మరో వ్యాఖ్య చేసారు. మరోసారి ఇలా జరిగితే మాత్రం అది యుద్ధానికి దారి తీస్తుందన్నారు.












Click it and Unblock the Notifications