ఆస్ట్రేలియన్ బ్యాంకులపై.. టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది
ఆస్ట్రేలియన్ బ్యాంకులతో జరుగుతున్న అతిపెద్ద రెగ్యులేటరీ పోరాటంలో టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది.
సిడ్నీ: ఆస్ట్రేలియన్ బ్యాంకులతో జరుగుతున్న అతిపెద్ద రెగ్యులేటరీ పోరాటంలో టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది. ఆపిల్ కు అనుకూలంగా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్(ఏసీసీసీ) తీర్పునిచ్చింది.
దీంతో తన కాంటాక్ట్ లెన్స్ పేమెంట్స్ టెక్నాలజీపై పూర్తి హక్కులు ఆపిల్ కంపెనీకే సొంతమయ్యాయి. అసలు ఆస్ట్రేలియన్ బ్యాంకులకు, ఆపిల్ కంపెనీకి ఉన్న వివాదం ఏమిటంటే..
ఆస్ట్రేలియాలోని నాలుగు దిగ్గజ బ్యాంకులు ఎలాంటి చెల్లింపులు లేకుండా తమ సొంత యాప్స్ కు ఆపిల్ పే టెక్నాలజీని వాడుకోవడానికి అనుమతినివ్వాలని కోరుతున్నాయి. కానీ దీనికి ఆపిల్ ఒప్పుకోవడం లేదు.
ఈ విషయంపై కామన్ వెల్త్ బ్యాంకు ఆఫ్ ఆస్ట్రేలియా, వెస్ట్ ప్యాక్ బ్యాంకింగ్ కార్పొరేషన్, నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు, బెండిగో బ్యాంకులు వారి కన్జ్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాయి.
అయితే ఈ బ్యాంకుల ప్రతిపాదనను ఆ కమిషన్ కూడా కొట్టిపారేసింది. అందరూ కలిసి ఆపిల్ ను బాయ్ కాట్ చేయడం, పోటీ వాతావరణాన్ని తగ్గించనట్టేనని ఏసీసీసీ శుక్రవారం పేర్కొంది.
అసలేంటీ వివాదం?
ఆపిల్ ఐఫోన్లలో వాడే కాంటాక్ట్ లెన్స్ పేమెంట్ టెక్నాలజీని తమ సొంత యాప్స్లో వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. వారు కోరుతున్న అగ్రిమెంట్ కు ఆపిల్ ఒప్పుకోకపోవడంతో బ్యాంకులు తమ కార్డులకు ఆపిల్ పేకు అనుమతివ్వడం లేదు.
ఆస్ట్రేలియా క్రెడిట్ కార్డు మార్కెట్లో మూడింట రెండు వంతుల హవా ఈ బ్యాంకులదే. దీంతో బ్యాంకులకు, ఆపిల్ కు వివాదం ఏర్పడింది. కమిషన్ ఒకవేళ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చి ఉంటే మార్కెట్లో ఉన్న పోటీని అదే తగ్గించినట్లు అయ్యేది. ఆస్ట్రేలియా బ్యాంకులపై ఇప్పుడు ఆపిల్ సాధించింది అతి పెద్ద విజయమేనని టెక్ వర్గాలు అంటున్నాయి.