6ఫీట్ల ఎత్తుతో ముందుకు: 2100నాటికి 1.9మిలియన్ల ఇళ్లు సముద్రంలోకి!
న్యూయార్క్: అమితమైన కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భూతాపంతో మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తమ సముద్ర తీరాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేగాక, సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసుకున్న నివాసాలు కూడా సముద్రంలో కలిసిపోనున్నాయి. ఇది అమెరికాలో అయితే మరీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ సంస్థ 'జిల్లో' ఇటీవల తాను నిర్వహించిన అధ్యయన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో సుమారు 2మిలియన్ల మంది ప్రజల జీవితాలపై సముద్ర జలాలు ప్రభావితం చూపనున్నాయి. 2100 నాటికి లక్షల సంఖ్యలో నివాసాలు సముద్రంలో మునిగిపోనున్నాయి. దీంతో కోట్ల డాలర్లలో ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా, లక్షలాది మంది నిరాశ్రయులు కానున్నారని వెల్లడించింది.
మేరీలాండ్, వర్జీనియాల్లోనే లక్ష మందికిపైగా ప్రజలు తమ నివాసాలను కోల్పోనున్నారు. కరోలినా ప్రాంతంలో మరో 1,40వేల మంది తమ నివాసాలను సముద్ర జలాల్లో కోల్పోనున్నారు. ఫ్లోరిడాలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు తమ నివాసాలను సముద్ర జలాలు ముందుకు రావడం వల్ల కోల్పోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సముద్ర జలాలు ఏస్థాయిలో ముందుకు వచ్చే అవకాశాలున్నాయన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. కాగా, జిల్లో నివేదికను ది వాషింగ్టన్ పోస్ట్ ఈ ఏడాది ముందు భాగంలో ప్రచురితం చేసింది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శతాబ్దం ముగిసే సరికి సముద్ర జలాలు 6 ఫీట్ల ఎత్తుతో ముందుకు కదలనున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం గాలిలో భారీ స్థాయిలో పెరిగిపోవడం ఇందుకు కారణమని చెబుతున్నారు.
కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం భారీగా పెరిగిపోవడం వల్ల ఓజోన్ పొర పలచబడి సూర్య కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీంతో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోయి ప్రపంచంలోని మంచు అంతా కరిగిపోతోంది. ఈ క్రమంలో నీటి మట్టాలు కూడా అంచనాలకు మంచి పెరిగిపోతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్న స్థాయిలోనే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, రానున్న రెండు మూడు దశబ్దాల కాలాల్లోనే సముద్ర మట్టాల పెరుగుదల మనకు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో సముద్ర మట్టాలు 2 ఫీట్ల మేర పెరగనున్నాయని చెబుతున్నారు.
సముద్ర మట్టాన్ని అడ్డుకునే నిర్మాణాలను ముందుగా చేపట్టడం వల్ల కొంత నష్ట నివారణ చేయవచ్చని, వరదలను అడ్డుకోవచ్చని వారంటున్నారు. అయితే, ఎలాగైనా కూడా సముద్ర మట్టాలు పెరగడం మాత్రం ఆగదని శాస్త్రవేత్తలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్య్సూరెన్స్ కంపెనీలో కూడా ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. కొన్ని నగరాలు కూడా ఇందుకు సిద్ధం కావడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
ఇటీవలో ఓ ఇంటర్య్వూలో కొలంబియా యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త మైకేల్ గెరార్డ్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కోనున్న అతి పెద్ద సమస్య ఇదని చెప్పారు. సముద్ర గమనం ఏ పరిమాణంలో ఉంటుందో చెప్పలేం కానీ, ఖచ్చితంగా సముద్ర మట్టం మాత్రం పెరుగుతుందని చెప్పారు. ఇది మనం తప్పించుకోలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.

నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన మ్యాప్లో సముద్ర జలాల్లో మునిగిపోయే ప్రాంతాలను జిల్లో సంస్థ నివేదిక గుర్తించడం జరిగింది. వచ్చే శతాబ్ధంలో ఏయే ప్రాంతాలు సముద్ర జాల్లాలో మునిగిపోనున్నాయో విస్తృత అధ్యయనం చేసింది జిల్లో. ఈ అధ్యయనంలో విస్తు గొలిపే వాస్తవాలు కనుగొన్నారు. అమెరికాలో 6ఫీట్ల ఎత్తుతో సముద్ర మట్టాలు ముందుకు రానున్నాయి. అది అమెరికాలో 2శాతం తీర ప్రాంతాలను ఆక్రమించనుంది. అంటే 882 బిలియన్ డాలర్ల విలువ చేసే నివాసాలు సముద్రంపాలు కానున్నాయి.
సముద్ర మట్టాలు పెరిగిపోవడమనేది భవిష్యత్ హౌజింగ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుందని జిల్లో ఎకనామిక్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
ఇక్కడ పేర్కొనబడిన రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో నివాసాలు సముద్రంలో కలిసిపోనున్నాయి.
ఫ్లోరిడా - 9,34,411
న్యూజెర్సీ - 1,90,429
న్యూయార్క్ - 96,708
సౌత్ కరోలినా - 83,833
లూసియానా - 80,080
మేరీలాండ్ - 64,299
మసాచూసెట్స్ - 62,069
నార్త్ కరోలినా - 57,259
టెక్సాస్ - 46,804
వర్జీనియా - 46,287
కాలిఫోర్నియా - 42,353
(సోర్స్: జిల్లో, నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అసోసియేషన్(ఎన్ఓఏఏ))
జిల్లో నివేదిక ప్రకారం సముద్రం ఏ నగరాలను ఎలా ఆక్రమిస్తుందో గమనించినట్లయితే.. మియామీ బీచులో ఇప్పటికే సముద్ర నీటి మట్టం పెరిగిపోయింది. అది అలాగే కొనసాగుతుంది. బోస్టన్లో ప్రతీ ఐదు ఇళ్లలో ఒకటి సముద్రంలో మునిగిపోనుంది. హోనలూలును అయితే చరిత్రలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ క్రమంలో ముందుగానే అప్రమత్తై నివారణ చర్యలు చేపట్టాలని న్యూజెర్సీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త, క్లైమెట్ సెంటర్ డైరెక్టర్ బెంజిమన్ స్ట్రాస్ సూచిస్తున్నారు. సముద్రంలో మునిగిపోయే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారిని అప్రమత్తం చేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని చెబుతున్నారు. ఇప్పటికే మనం మేల్కోకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications