రెండు పడవల మునక: 32మంది మృతి
కౌలాలంపూర్/మాలీ: మలేషియా, మాలీలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 32మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి ఘటన వివరాల్లోకి వెళితే.. మలేషియా పశ్చిమ తీర ప్రాంతంలోని మలక్కా జలసంధి వద్ద ఓ వలసదారుల పడవ మునిగిపోయింది.
పడవలోని 70 మంది ఇండోనేషియా వాసుల్లో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పడవలో 70 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నా దాదాపు 100 మందిని ఎక్కించుకున్నట్లు స్థానిక జాలర్లు చెబుతున్నారు.
ఘటనాస్థలికి 12 పడవలతో పాటు 200 మంది సహాయక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. 13 మృతదేహాలు వెలికితీయగా మరో 13 మందిని రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బాధితులని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారు మలేషియాకి వస్తున్నారా లేక అనుమతి లేకుండా మలేషియా నుంచి వెళ్లిపోతున్నారా అన్న విషయమై బాధితుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు.
మాలిలో పడవ మునక: 19 మంది మృతి
బమాకో: పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశంలో మరో పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో ఓ పడవ మునిగిపోవడంతో 19 మంది మృతిచెందారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్ధానిక బాంగో ప్రాంతానికి 140 కి.మీ.ల దూరంలో ఉన్న నైగర్ నదిలో ఓ పడవ అదుపుతప్పి మునిగిపోయింది.
దీంతో 19 మంది మృతిచెందగా మరో నలుగురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది సుమారు 70 మందిని రక్షించగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా లేక అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.