రష్యా దాడులు: సిరియాలో 200 మంది అంతం
సిరియా: రష్యా వైమానిక దాడుల్లో సిరియాలో 200 మంది సామాన్య పౌరులు మరణించారని వెలుగు చూసింది. రష్యా జరుపుతున్న క్షిపణి దాడుల్లో అమాయకులు బలి అవుతున్నారని ఓ స్వచ్చంద సంస్థ వెల్లడించింది.
రష్యా తమ లక్ష్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నదని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో తెలిపింది. సిరియాలోని అలెప్పో, ఇడ్లిబ్, లటాకియా, హమా తదితర ప్రాంతాల్లో రష్యా దాడులు జరిపిందని ఆ సంస్థ వివరించింది.
నవంబర్ 29వ తేదిన ఇడ్లిబ్ ప్రాంతంలో రద్దీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లో రష్యా క్షిపణి దాడి చేసిందని, అక్కడే 49 మంది పౌరులు దుర్మరణం చెందారని నివేదిక పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల పై దాడులు చెయ్యాలని సిరియా నేత అల్ బషర్ రష్యాకు మనవి చేశారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని రష్యా సెప్టెంబర్ 30వ తేది ప్రకటించింది. తరువాత సిరియాలో దాడులు మొదలు పెట్టింది. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చెయ్యకుండా అల్ బషర్ వ్యతిరేకులను రష్యా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.
యుద్ద సమాచారన్ని పూర్తిగా తెలుసుకోకుండా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక విడుదల చేసి కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తున్నదని రష్యా మండిపడింది. తామూ పూర్తి సమాచారం తెలుసుకుని నివేదిక విడుదల చేశామని అమ్నెస్టీ సమర్థించుకుంది.