న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతి
షాంఘై: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా చైనాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని షాంఘైలో తొక్కిసలాట జరిగి 35 మంది మరణించారు. మరో 42 మంది గాయపడ్డారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నదీ సమీపంలోని చిన్నపాటి దారిలో పెద్ద యెత్తున ప్రేక్షకులు గుమిగూడారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఊహించనంతగా ప్రజలు వేడుకలకు హాజరయ్యారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. తొక్కిసలాటకు కారణం ఏమిటనే విషయంపై విచారణ జరుగుతోంది. షాంఘై చారిత్రాత్మక నదీ ప్రదేశంలో ఇరుకు దారులు ఉంటాయి. పాత భవంతులు, దుకాణాలు, పర్యాటక ఆకర్షణలు ఉంటాయి.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిత్రాలు ఆ ప్రదేశంలో భయాందోళనలు ముప్పిరిగొన్న విషయాన్ని స్పష్టంగా పట్టిస్తున్నాయి. సంఘటనా స్థలంలో పోలీసులు, భద్రతా సిబ్బంది పెద్ద యెత్తున ఉన్నారు. గాయపడినవారికి ప్రథమ చికిత్స చేస్తున్నారు.
సంఘటనా స్థలంలో చెప్పులు, చెత్తాచెదారం చిందరవందరగా పడి ఉన్నాయి. 25 మంది మహిళలు, పది మంది పురుషులు మరణించినట్లు పాలక కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నడిపే పీపుల్స్ డైలీ తెలియజేస్తోంది. మృతులు 16, 36 మధ్య వయస్సు గలవారు. గాయపడినవారిలో ముగ్గురు తైవాన్కు చెందినవారు, ఒకరు మలేషియాకు చెందినవారు ఉన్నారు. డాలర్ బిల్లుల మాదిరిగా కనిపించిన కూపన్స్ను ఓ భవనం మూడో అంతస్థు నుంచి పడేయడంతో తొక్కిసలాట ప్రారంభమైనట్లు చెబుతున్నారు