కాంగోలో ఘోర ప్రమాదం: ట్యాంకర్లు ఢీ, 50 మంది సజీవ దహనం, లీకైన ఇంధనం కోసం వచ్చి..
కిన్షాసా: శనివారం నాడు కాంగోలో ఘోరం జరిగింది. ఓ ఇంధనంతో వెళ్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇంధనం అంతా రోడ్డుపై పారింది. దీంతో దగ్గరలోని గ్రామస్తులు ఆ ఇంధనం తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ అంతలోనే మంటలు సంభవించాయి. దీంతో ట్రక్కులోని వారు, గ్రామస్తులు దాదాపు 50 మంది చనిపోయారు. మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)
ఇది దేశంలోనే ఓ అతిపెద్ద ట్రాఫిక్ ప్రమాదమని కాంగో ప్రెసిడెంట్ జోసెఫ్ కబిలా అన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మూడు రోజులు సంతాపదినంగా ప్రకటించారు.
ఈ ప్రమాదం ఎంబుబా గ్రామంలో జరిగింది. ఈ గ్రామం కిసంతు నగరానికి సమీపంలో ఉంటుంది. రాజధాని కిన్షాసాకు 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం జరిగిన దారి జాతీయ రాజధాని కిన్షాసాకు, దేశంలోని మాతాది సీ పోర్ట్కు ఉన్న ఒకే హైవే.
ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిపివేశారు. పలు వాహనాలకు మంటలు అంటుకోవడంతో బుగ్గయ్యాయి.
క్షతగాత్రుల ఆర్తనాదాల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కాంగో తాత్కాలిక గవర్నర్ అటో మటుబువనా ధ్రువీకరించారు. హైవే పక్కన ఇళ్లకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాప్తించాయి.
ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయని హెల్త్ మినిస్టర్ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ చేయిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రయలర్ డ్రైవర్ కన్నుమూశాడు. ట్యాంకర్ ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. 2010లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి 200 మంది చనిపోయారు. ట్యాంకర్ ట్రక్ సౌత్ కివి ప్రావిన్స్లోకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.