రష్యా సముద్రంలో పడవ మునిగి 54 మంది మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని తూర్పు సముద్ర తీరంలో ఓ పడవ మునిగి 54 మంది చనిపోయారు. ఇందులో మొత్తం 132 మంది ఉండగా, పడవ మునిగిపోతున్న సమయంలో 63 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
మరో 15 మంతి గల్లంతయ్యారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని కమచత్కా ద్వీపకల్ప సముద్ర జలాల్లో ఈ దారుణం జరిగిందని రష్యన్ అధికార ప్రతినిధి తాత్యానా యుకమనోవా తెలిపారు. మగడాన్ నగరానికి 250 కిలోమీటర్లు దూరంలో ఒఖోట్స్ సముద్రంలో వోస్టోక్ అనే పేరు గల ఈ పడవ 15 నిమిషాల్లోనే మునిగిపోయినట్లు తెలిపారు.
దాదాపు సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కల్గిన సముద్ర జలాల్లో అడ్డు తగిలిన మంచు గడ్డల కారణంగానే పడవ ప్రమాదానికి గురైనట్లు మారిటైమ్ అధికారి క్లెపికోవ్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 78 మంది రష్యన్లు, 42 మంది మయన్మార్, ఐదుగురు వన్వాటు, ముగ్గురు లాటిన్, నలుగురు ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.
సముద్ర జలాల్లో శీతలంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. 1300 మంది సిబ్బంది, 26 పడవులు, ఒక విమానం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.