కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ కన్నుమూత - ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం ..!!
క్రికెట్లో మరో విషాదం చోటు చేసుకుంది. మరో దిగ్గజ క్రికెటర్ ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా క్రికెట్లో షేన్ వార్న్ మరణం మరవకముందే మరో ప్రముఖ క్రికెటర్ మరణించారు. మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) ఓ కారు ప్రమాదంలో మరణించారు. క్వీన్స్లాండ్లోని అలైస్ రివర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెర్వే రేంజ్ రోడ్లో జరిగిన కారు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 10.30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అతడి మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కెరీర్లో ఆల్రౌండర్గా సత్తా చాటిన సైమండ్స్.. మొత్తంగా 26టెస్టుల్లో 1462 పరుగులు చేయగా, 24 వికెట్లు తీసారు. 198 వన్డేలు ఆడిన సైమండ్స్ 5088 పరుగులు చేసారు. అదే విధంగా..133 వికెట్లు తీసారు. ఇక, 14 టీ20లు ఆడగా.. అందులో 337 పరుగులు చేసి.. 8 వికెట్లు పడగొట్టారు. సైమండ్స్ 39 ఐపీఎల్ ఆడి అందులో 974 పరుగులు చేయటంతో పాటుగా , 20 వికెట్లు తీసారు. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అతడు 2012లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇటీవలే ఆసీస్ ప్లేయర్స్ రాడ్ మార్ష్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూయగా.. ఇప్పుడు సైమండ్స్ మరణించడంతో క్రికెట్ క్రీడాలోకం షాక్ కు గురైంది.
కొద్ది రోజుల క్రితమే సైమండ్స్ ఐపీఎల్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆల్ రౌండర్ గా ఆసీస్ జట్టులో సైమండ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జట్టును ఆనేక కష్ట సమయాల్లో తన సమర్ధతతో గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సైమండ్స్ ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన వెంటనే క్రికెట్ ప్రముఖులు స్పందిస్తున్నారు.
సైమండ్స్ క్రికెట్ కు అందించిన సేవలను గుర్తు చేసుంటున్నారు. సైమండ్స్ మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లతో పాటుగా అనేక దేశాల క్రికెటర్లు ఆవేదనతో సంతాప సందేశాలు ఇస్తున్నారు. 2008 లో మంకీగేట్ స్కాండల్ ఆయనకు మచ్చగా మిగిలింది. ఇండియన్ క్రికెటర్ హర్భజన్ వివాదం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిది.