Bangladesh news: మిత్రదేశం బంగ్లాదేశ్కు భారీ ఎదురుదెబ్బ.. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం
Bangladesh health: పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇటీవల ఏర్పడిన రాజకీయ సంక్షోభం తీవ్ర అస్థిరతకు కారణమైంది. ఇదికాస్తా మతం రంగు పులుముకుంది. దీంతో అక్కడి ముస్లింలు హిందువులపై దాడులకు తెగబడుతున్నారని భారత్ వ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా పలు లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు డెంగ్యూ కేసులు బంగ్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో మొత్తం 1,221 మందికి డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒకే రోజు ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దోమల వల్ల కలిగే ఈ వ్యాధి కారణంగా 8 మంది మరణించినట్లు వెల్లడించింది. దీంతో ఈ ఏడాది డెంగ్యూ వల్ల ఏర్పడిన మరణాల సంఖ్య 158కి పెరిగినట్లయింది.

తాజా ఇన్ఫెక్షన్లతో బంగ్లాదేశ్లో డెంగ్యూ కేసుల సంఖ్య 29 వేల 786కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతకంతకూ పెరుగుతున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి, దోమల పెరుగుదలను తనిఖీ చేయడానికి మరియు లార్వా వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. జూన్-సెప్టెంబర్ మధ్య కాలం వారికి డెంగ్యూ జ్వరం సీజన్. దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు ప్రబలే ప్రాంతంగా బంగ్లాదేశ్ పరిగణించబడుతుంది.
డెంగ్యూ అనేది దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఉష్ణమండల ప్రాంతాల్లో దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి ఫ్లూ లక్షణాలతో ఇది ప్రారంభమవుతుంది. వ్యాధి సంక్రమణ తర్వాత 3 నుంచి 14 రోజులకు లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వారం కంటే తక్కువ రోజులు ఉంటాయి. ఏడెస్ జాతి దోమల కాటు వల్ల ఇది సంక్రమిస్తుంది. కాగా ఈ దోమలు ఇంట్లో మరియు ఆరుబయట, పగలు మరియు రాత్రి వేళల్లోనూ కుట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications