బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం... 52 మంది మృతి... ఫ్యాక్టరీలో మంటలకు ఆహుతైన కార్మికులు...
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నారాయణ్గంజ్ రూప్గంజ్ ప్రాంతంలోని ఆరంతస్తుల ఓ జ్యూస్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 52 మంది మృతి చెందగా మరో 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గురువారం(జులై 8) సాయంత్రం 5గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మొదట గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు...
జ్యూస్ ఫ్యాక్టరీలోని గ్రౌండ్ ఫ్లోర్లో మొదట మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ భవనంలో కెమికల్స్,ప్లాస్టిక్ బాటిల్స్ పెద్ద ఎత్తున ఉండటంతో... క్షణాల్లో మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కొంతమంది కార్మికులు భవనం పైనుంచి కిందకు దూకేశారు. ఇందులో ముగ్గురు తీవ్ర గాయాలతో మృతి చెందారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే హుటాహుటిన 18 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోసారి చెలరేగిన మంటలు...
మంటలు అదుపులోకి వచ్చాయని భావించినప్పటికీ... శుక్రవారం(జులై 9) ఉదయం ఐదు,ఆరు అంతస్తుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటల వేడికి బిల్డింగ్లో పగుళ్లు వచ్చాయని.. కిటికీలు,అల్యూమినియం నిర్మాణాలు ఊడిపోతున్నాయని తెలిపారు. బిల్డింగ్ లోపల ఇప్పటివరకూ 49 మృతదేహాలను గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొన్నారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
Recommended Video
మృతుల కుటుంబ సభ్యుల నిరసనలు
ప్రమాద ఘటనపై నారాయణ్గంజ్ జిల్లా ఫైర్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ... మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. జరిగిన నష్టాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు.మరోవైపు అగ్నిప్రమాదంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులు,బంధువులు ఢాకా రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులు రోడ్లపై వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.ప్రమాద ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications