ట్రంప్ చివరి ప్రసంగం: బిడెన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా: వాషింగ్టన్కు గుడ్బై
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధాని వాషింగ్టన్..వేదికగా ఆయన 46వ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. దీనికోసం ఆయన తన సొంత రాష్ట్రం డెలావర్ నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. భార్య జిల్ బిడెన్తో కలిసి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్లో దిగారు. ఆ వెంటనే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కలిసి లింకన్ స్మారక స్థూపాన్ని సందర్శించారు. కరోనా బారిన పడి మరణించిన నాలుగు లక్షలమందికి అశ్రు నివాళి అర్పించారు.
Recommended Video
కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా
మరోవంక- డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్హౌస్ను ఖాళీ చేసే పనిలో పడ్డారు. జో బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తాను పాల్గొనబోవట్లేదని ఇంతకుముందే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. వాషింగ్టన్ను వీడారు. అధ్యక్ష హోదాలో ఆయన చిట్టచివరిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 19 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రీ రికార్డెడ్ వీడియోను వైట్హౌస్ అధికారులు విడుదల చేశారు. తన నాలుగేళ్ల హయాంలో తీసుకున్న నిర్ణయాలు, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ గురించి ప్రస్తావించారు. వాషింగ్టన్లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపైనా మాట్లాడారు. జో బిడెన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాను అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేశానని ట్రంప్ చెప్పుకొచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ క్యాంపెయిన్కు కోట్లాదిమంది అండగా నిలిచారని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం ఎవరికైనా గర్వకారణమేనని, అలాంటి ఘనతను తాను సాధించానని చెప్పారు. అమెరికన్లు అత్యంత శక్తిమంతులుగా తమ దేశాన్ని మలచుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని, కొత్త ప్రభుత్వంలో ఆ లక్ష్యానికి అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగామని ట్రంప్ అన్నారు.
కరోనా వైరస్కు జన్మనిచ్చిన చైనా.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనానికి గురి చేసిందని పేర్కొన్నారు.వాషింగ్టన్లో చోటు చేసుకున్న పరిణామాలు, పార్లమెంట్ భవనంపై సంభవించిన దాడులు.. ఏ మాత్రం సమర్థనీయం కావని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉన్న తనను ఆ పరిణామాలు కలచివేశాయని అన్నారు. అమెరికన్లు శాంతికాముకులని పునరుద్ఘాటించారు. తమకు ఆగ్రహం వస్తే.. ఎలాంటి కార్యకలాపాలకైనా దిగుతారని నిరూపించినట్టయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనంపై సంభవించిన దాడి.. అత్యంత భయానకమైనదిగా అభివర్ణించారు.