భారత్ పై పాకిస్థాన్ న్యూక్లియర్ బాంబ్..? ఎంతకు తెగించార్రా..?
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. అంతేకాక పాకిస్థాన్ కు ప్రధానమైన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే ఇదే విషయంపై పాకిస్థాన్- భారత్ మధ్య తాజాగా ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ పై పాకిస్థాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ భారత్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి వచ్చే నీటి సరఫరాను పరిమితం చేసే ఏ ప్రయత్నాన్నైనా జాతీయ భద్రతకు వాటిల్లే తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. నీటి భద్రతపై జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ నీటి వివాదాన్ని పాకిస్థాన్ అణు సిద్ధాంతంతో ముడిపెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం భారత్ కఠిన నిర్ణయమే. 2025లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత, దౌత్య వ్యూహంలో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయకుండా భారత్ నిలిపివేసింది. ఈ చర్య పాకిస్థాన్ లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ దేశ ఆర్థిక భద్రత, జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉండటంతోనే బిలావల్ భుట్టో ఇలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సింధు నదీ జలాల అంశాన్ని కేవలం పర్యావరణ సమస్యగానో లేక సాధారణ దౌత్యపరమైన వివాదంగానో చూడలేమని భుట్టో స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రయోజనాలకు లేదా నదీ జలాలకు ముప్పు వాటిల్లినప్పుడు, అత్యంత అరుదైన, సంక్లిష్టమైన పరిస్థితిలో అణు ప్రతిస్పందనకు తమ విధానాలు అనుమతిస్తాయని ఆయన గుర్తు చేశారు. భారత్ తరహాలో 'నో ఫస్ట్ యూజ్' అనే స్పష్టమైన విధానం పాకిస్థాన్ కు లేదు. అందువల్ల ఈ జల వివాదం మరింత సున్నితమైన అంశంగా మారింది.
జలవనరుల లభ్యతపై పాకిస్థాన్ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఆ దేశ సాగునీటి అవసరాలలో దాదాపు 80 శాతం పంట భూములు కేవలం సింధు నదీ పరివాహక ప్రాంతంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నదీ జలాల భద్రతే దేశ మనుగడకు అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలోనే పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలతో పాటు కాశ్మీర్, గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రజలంతా తమ జల హక్కుల పరిరక్షణ కోసం కలిసికట్టుగా నిలబడాలని బిలావల్ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ చట్టాల పరిధిలో.. పరస్పర దౌత్య పరమైన గౌరవంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. నదీ జలాలను ఒత్తిడి తెచ్చే ఆయుధాలుగా ఉపయోగించకూడదని హితవు పలికారు. 1960లో కుదిరిన ఈ చారిత్రక సాగునీటి ఒప్పందం పలు యుద్ధాలు, ఉద్రిక్తతల సమయాల్లోనూ భారత్- పాక్ మధ్య కొనసాగుతూ వచ్చింది. అయితే మారిన భౌగోళిక, కఠిన రాజకీయ పరిస్థితులలో ఈ ఒప్పందం భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications