‘బాయ్కాట్’తో మీకే చేటు: భారత్కు చైనా హెచ్చరిక
న్యూఢిల్లీ: యూరీ దాడి అనంతరం కూడా పాకిస్థాన్కు చైనా మద్ధతు ఇచ్చిన నేపథ్యంలో ఆ దేశంపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చైనా వస్తువులను అనధికారికంగా నిషేధం విధించాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో భారత్లో చైనా వస్తువులు బహిష్కరించాలనే ప్రచారంపై చైనా భారత్కు హెచ్చరికలు చేసింది.
తమ వస్థువుల బహిష్కరణ వల్ల భారత్లో చైనా కంపెనీల పెట్టుబడుల అంశంపై చెడు ప్రభావం చూపిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది. ఈ ప్రచారం చైనా ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపదని.. దీని వల్ల భారత్కే ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొంది.
చైనా వస్తువులకు సరైన ప్రత్యామ్నాయం లేకపోతే భారత వ్యాపారులు, వినియోగదారులు అధికంగా నష్టపోతారని ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా వస్తువులు ఎగుమతి చేసే దేశమని తెలిపింది.
నిరుడు 2276.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని.. ఆ మొత్తం ఎగుమతుల్లో భారత్కు చేసిన ఎగుమతులు రెండు శాతం మాత్రమే అని పేర్కొంది. అందువల్ల భారత్లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం వల్ల చైనాపై పెద్దగా ప్రభావమేమీ చూపదని చైనా స్పష్టం చేసింది.
అయితే చైనా వస్తువుల నిషేధం ప్రచారంతో.. దీపావళి సీజన్లో భారత్లో చైనా వస్తువుల అమ్మకం 30 శాతం తగ్గినట్లు ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఈ సీజన్లోని అలంకరణ దీపాలు, ఫర్నీచర్, బొమ్మలు, టపాసుల ఎగుమతిలో చైనాకు భారత్ అతి పెద్ద మార్కెట్గా ఉండటం గమనార్హం.