ఐరాస సర్వసభ్య సమావేశంలో కరోనా కలకలం: ఆరోగ్య మంత్రి పాజిటివ్: న్యూయార్క్లో పిజ్జా తింటూ
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ లాంఛనంగా ఈ సమావేశాలను ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇక వరుస బెట్టి అన్ని దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు ఈ సర్వసభ్య సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది.
కరోనా కలకలం..
ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. 25వ తేదీన ఆయన ప్రసంగిస్తారు. సజావుగా సాగుతుందనుకుంటోన్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు ఐక్యరాజ్య సమితి. ప్రాణాంతక కరోనా వైరస్ కలకలం రేపింది. బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్సెలొ క్యురెగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకినట్లు బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన మార్సెలో అమెరికాకు వచ్చారు. న్యూయార్క్లో బస చేస్తోన్నారు.
పాజిటివ్ రిపోర్ట్..
ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నిర్ధారణ పరీక్షలను చేయిస్తోంది ఐక్యరాజ్య సమితి. కరోనా వైరస్ ప్రొటొకాల్స్ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా- మార్సెలొకు వైరస్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయన ఐసొలేషన్లోకి వెళ్లారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా మార్సెలొకు కరోనా సోకడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిలకడగా ఆరోగ్యం..
జో బైడెన్ ప్రారంభ ఉపన్యాసం అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్స్నారో ప్రసంగించారు. కాగా- బోల్స్నారోతో సన్నిహితంగా మెలిగారు మార్సెలొ. అలాగే- బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తోనూ వారు భేటీ అయ్యారు. దీనితో మార్సెలొ ద్వారా మరింత మందికి వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రస్తుతం మార్సెలొ ఆరోగ్యం బాగుందని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. ఆయనతో పాటు న్యూయార్క్కు వెళ్లిన అధికారుల బృందం సభ్యులకు కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని, అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొంది.
Recommended Video
న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్
బోల్స్నారో, మార్సెలొ, ఇతర మంత్రులు అధికారులు న్యూయార్క్లోని ఓ రెస్టారెంట్లో పిజ్జా తిన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సమయంలోనే మార్సెలొకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించట్లేదు. పిజ్జా తింటోన్న సమయంలో మార్సెలొ మాత్రమే మాస్క్ను ధరించి కనిపించారు. పిజ్జా తినాల్సి ఉన్నందున తన మాస్క్ను గడ్డం కిందికి తీసుకొచ్చారు. ఆయన తప్ప మరెవరూ మాస్క్ను ధరించలేదు బోల్స్నారోతో సహా.