భారత్లో ఆ రాష్ట్రాలకు వెళ్తే.. మీ ప్రాణాలకు నో గ్యారంటీ: హెచ్చరించిన కెనడా- అనూహ్యంగా
ఒట్టావా: భారత్లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. మూడు రాష్ట్రాల పేర్లను ఇందులో పొందుపరిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో తాము సూచించిన ప్రదేశాలకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. మందుపాతరలు పేలే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్రణాళిక వేసుకుని ఉంటే- దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో సూచించింది.
పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలను తన ఇందులో పొందుపరిచింది. సరిహద్దు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని సూచించింది. మందుపాతరలు పేలే ప్రమాదం ఉందని పేర్కొంది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్లల్లో పాకిస్తాన్ సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాలకు వెళ్లడాన్ని మానుకోవాలని కెనడా తన దేశ పౌరులకు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది.

దేశమంతటా తీవ్రవాద దాడుల ముప్పు పొంచివుందని, ఈ కారణంగా భారత్లో పర్యటించే తమ దేశపౌరులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. ఉగ్రవాదం వల్ల అస్సాం, మణిపూర్లకు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించింది. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతాల పేర్లను మినహాయించింది కెనడా ప్రభుత్వం. లఢక్ను మినహాయించినట్లు తెలిపింది.
కెనడాకు సంబంధించి.. ఇటీవలే భారత్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసిన విషయం తెలిసిందే. కెనడాలో పెరుగుతున్న నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల మధ్య కెనడాలోని తమదేశ పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెల 23వ తేదీన అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలో ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల సంఘటనలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications