బంగాళాఖాతంలో మునిగిన కార్గో నౌక.. 24 మంది సిబ్బంది గల్లంతు..
పనామా జెండా కలిగిన కార్గో నౌక బంగాళాఖాతంలో మునిగింది. ఈ ప్రమాదంలో నౌకలోని 24 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒడిషా నుంచి ఐరన్ ఓర్ ను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ బంగాళాఖాతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఒడిషా లోని పారాదీప్ ఐలాండ్ కు దాదాపు 240 నాటికల్ మైల్స్ దూరంలో ఈ కార్గో నౌక మునిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది చైనీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇతర నౌకలను కూడా ఈ మేరకు అలర్ట్ చేశారు. సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమాద సమయంలో కార్గో నౌకలో దాదాపు 24 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా మునిగిపోయారని.. సిబ్బందిలో ఎంత మందిని సురక్షితంగా బయటకు తీశామో తెలియాల్సి ఉందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి పీటీఐ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం 24 మంది సిబ్బందిలో 20 మంది చైనీయులు ఉన్నారు. ఒకరు బంగ్లాదేశీ కాగా మరో ముగ్గురు మయన్మార్ కు చెందినవారుగా తేలిందని తెలిపారు. అయితే ప్రమాద సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారన్న సంగతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని వివరించారు.

డీజీపీ, పారాదీప్ యూనిట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంజయ్ నేగీ ఈ ఘటనపై మాట్లాడుతూ.. అండమాన్ అండ్ నికోబార్ యూనిట్ ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోందని అన్నారు. రేపు ఉదయం వరకు రెస్క్యూ పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇక ఈ కార్గో నౌక శుక్రవారమే ఒడిషా తీరం నుంచి బయల్దేరింది. నౌక చైనాకు చెందినదిగా సమాచారం.. ఈ నౌక సింగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications