శ్రీలంకలో మూతపడ్డ క్యాథలిక్ చర్చిలు: సామూహిక ప్రార్థనల రద్దు
కొలంబో: శ్రీలంకలో చర్చ్ లు, హోటళ్ల మీద ఆత్మాహూతి దాడుల అనంతరం అక్కడి భద్రత మీద అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. చర్చిలకు పటిష్ట భద్రత కల్పించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమౌతోందంటూ తాజాగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి క్యాథలిక్ సామాజిక వర్గ మత పెద్దలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చర్చిల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించేంత వరకూ దేశంలోని అన్ని క్యాథలిక్ చర్చిలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని క్యాథమిక మత పెద్ద కార్డినల్ మాల్కమ్ రంజిత్ తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ చర్చిలను మూసి ఉంచుతామని అన్నారు. భద్రతా బలగాల నుంచి వచ్చిన సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మాల్కమ్ రంజిత్ తెలిపారు.
కుదుటపడుతున్న కొలంబో! ఆత్మాహూతి దాడి చోటు చేసుకున్న స్టార్ హోటల్ లో పెళ్లి వేడుక
గురువారం ఉదయం ఆయన కొలంబోలో విలేకరులతో మాట్లాడారు. చర్చిల వద్ద భద్రత కల్పించేత వరకూ ఎవరికీ ప్రవేశం ఉండదని అన్నారు. దేశంలోని అన్ని క్యాథలిక్ చర్చ్ లను కొద్దిరోజుల పాటు మూసి ఉంచుతామని చెప్పారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, దీనితోపాటు- చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్నందున..కనీస ముందు జాగ్రత్త చర్యలను పాటించాల్సిన బాధ్యత తమపైన కూడా ఉందని చెప్పారు. అందుకే- క్యాథలిక్ చర్చిల్లో ఎవరికీ ప్రవేశం ఉండదని, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అవి మూత పడి ఉంటాయని అన్నారు. భద్రతా ప్రమాణాలు మెరుగు పడిన తరువాతే తెరుస్తామని చెప్పారు.
ఇదిలావుండగా.. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఆత్మాహూతి దాడికి గురైన శ్రీలంక ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. రోడ్లపై జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ స్తంభించిపోయిన జనజీవనం కాస్త మెరుగుపడుతోంది. దాడుల పీడకల నుంచి ప్రజలు బయట పడుతున్నారు. సాధారణ జనజీవనానికి అలవాటు పడుతున్నారు. ఆత్మాహూతి దాడితో మరుభూమిగా స్టార్ హోటల్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన చోట ఓ కొత్త జంట సరికొత్త జీవితానికి శ్రీకారం చుడుతోంది. కొలంబోలో ఆత్మాహూతి దాడి చోటు చేసుకున్న కింగ్స్ బరి స్టార్ హోటల్ గురువారం తెరచుకుంది. పెళ్లి వేడుకను నిర్వహించడానికి హోటల్ ను తెరచినట్లు యాజమాన్యం వెల్లడించింది.