రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో బాంబు పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా: సీసీటీవీలో రికార్డ్
Pakistan Blast: పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే భద్రత సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని క్వెట్టా సివిల్ ఆసుపత్రికి తరలించారు. చెల్లాచెదురైన మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో సంఘటన స్థలం భీతావహంగా కనిపించింది. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో మార్మోగిపోయింది.

క్వెట్టా రైల్వే స్టేషన్లో ఈ ఉదయం 9 గంటల సమయంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్వెట్టా- పెషావర్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్లడానికి కొద్దిసేపటి ముందు పేలుడు సంభవించింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో వందమందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
పేలుడు ఘటనలో 25 మంది దుర్మరణం పాలైనట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) మహ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనకు ఆత్మాహూతి చర్యగా అనుమానిస్తోన్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడొకడు తనను తాను పేల్చుకొని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తోన్నట్లు మహ్మద్ బలోచ్ చెప్పారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు క్వెట్టా పోలీసులు. ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పట్ల పాకిస్తాన్ అధ్యక్షుడు యూసుఫ్ రజా గిలానీ, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
బాంబు పేలుడు తరువాత క్వెట్టా నగరం వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండొచ్చనే అనుమానాలతో క్వెట్టా రైల్వే స్టేషన్తో పాటు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
🚨 CCTV footage of the Quetta Railway Station blast!#Quetta #Balochistan pic.twitter.com/OU83XaZIZA
— Dukhtar-E-Balochistan🇵🇰 (@Dukhtar_B) November 9, 2024
దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. క్వెట్టా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్పై ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపించిందా సమయంలో. ప్లాట్ ఫామ్ అంతా కూడా ప్రయాణికుల సందడితో నిండిపోయింది. వాళ్లంతా తమ లగేజీని తీసుకుని క్వెట్టా- పెషావర్ ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూడటం ఇందులో చూడొచ్చు.
అదే సమయంలో ఏ మాత్రం ఊహించని విధంగా శక్తిమంతమైన పేలుడు సంభవించడం.. ప్లాట్ ఫామ్పై అమర్చిన సీసీటీవీల్లో స్పష్టంగా రికార్డయింది. పేలుడు ధాటికి ప్లాట్ ఫామ్ పైకప్పు తునాతునకలైంది. పేలుడు సంభవించిన వెంటనే అక్కడున్న ప్రయాణికుల్లో కొందరు ప్లాట్ఫామ్పై పడుకోవడం, మరికొందరు అక్కడి నుంచి పరుగెత్తడం ఈ సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది.












Click it and Unblock the Notifications