ఇప్పటికే కరోనాతో చైనా విలవిల: ఇప్పుడు మరో కొత్త వైరస్! హునన్ ప్రావిన్స్ అప్రమత్తం
బీజింగ్: చైనా ఇప్పటికే కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న చైనాను మరో వైరస్ ఇప్పుడు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, చైనాలో 'బర్డ్ ఫ్లూ' ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
4500 కోళ్ల మరణం
కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు(ఎక్కువగా కరోనా బాధితులున్న ప్రాంతం వుహాన్ ఈ ప్రావిన్సులోనే ఉంది) దక్షిణాన ఉన్న హునన్ ప్రావిన్సులో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే హెచ్5ఎన్1 వైరస్ గుర్తించినట్లు చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ తెలిపింది. షయోయాంగ్ నగరం శివారులోని ఓ కోళ్లఫారంలో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4500 కోళ్లు మరణించినట్లు పేర్కొంది.
అప్రమత్తమైన మంత్రిత్వ శాఖ..
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని మిగితా బాగున్న వాటిని వేరుచేశారు. కాగా, ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదని సదరు మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సదరు మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా బారిన పడి 300మందికి పైగా మృతి.. మరో 300 మంది పరిస్థితి విషమం
ఇది ఇలా ఉండగా, కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 300కుపైగా ప్రజలు మృతి చెందారు. మరో 14,380మందికిపైగా వైరస్ బారినపడినవారు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 300మందికిపైగా రోగుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సుమారు 5వేల మంది వరకు వ్యాధి అనుమానితుల్సిన వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా, ఫిలిప్పీన్స్లో కరోనా వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించాడు. చైనా అవతల వైరస్ వ్యాధితో చోటు చేసుకున్న తొలి మరణం ఇదే కావడం గమనార్హం. చైనాలో పుట్టిన ఈ వైరస్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను ఆందోళనలకు గురిచేస్తోంది.
భారత్లో రెండు కేసులు
భారత్లోనూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. తాజాగా కేరళలో రెండు కేసులు నమోదయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ బారిన పడినట్లు అనుమానిస్తున్న పలువురు ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. చైనాలో ఉన్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చి వారికి వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.