చైనా మాజీ అధ్యక్షుడు కన్నుమూత - మరణానికి కారణం ఇదే...!!
బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాంఘైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న జియాంగ్.. అందుకు చికిత్స తీసుకుంటోన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. లుకేమియాతో పాటు పలు అవయవాలు పనిచేయకపోవడం ఆయన మరణానికి దారి తీసినట్లు చైనీస్ మీడియా తెలిపింది.
మధ్యాహ్నం 12:13 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ధృవీకరించింది. కామ్రెడ్ జియాంగ్ జెమిన్ ఇక లేరని పేర్కొంది. ఆయన లేని లోటు పార్టీ, ప్రభుత్వం, దేశ ప్రజలు పూడ్చలేనిదని నివాళి అర్పించింది. ఆయనను గొప్ప మార్క్సిస్ట్ నాయకుడిగా, మిలటరీ స్ట్రాటజిస్ట్గా, దౌత్యవేత్తగా కమ్యూనిస్ట్ పార్టీ అభివర్ణించింది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే చైనాలోని అన్ని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వం, వివిధ దేశాల్లో ఉన్న రాయబార భవనాల మీద జెండాలను అవనతం చేశారు. ఇవ్వాళ్టి నుంచి సంతాప దినాలను ప్రకటించారు. అంత్యక్రియలు ముగిసేంత వరకు సంతాప దినాలు కొనసాగుతాయి. అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
జెమిన్ మృతిపట్ల వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు సంతాపం తెలిపారు. తియానన్మెన్ స్క్వేర్ నిరసనల తర్వాత అధికారంలోకి వచ్చారు జెమిన్. 1989లో బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద చోటు చేసుకున్న రక్తపాతం తరువాత జియాంగ్ అధికారంలోకి వచ్చారు. 1993 మార్చి 27వ తేదీన చైనా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. 2003 మార్చి 15వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు.
డ్రాగన్ కంట్రీని ఆధునిక దేశంగా నిలబెట్టారు. ఆయన హయాంలో చైనా ఆర్థికంగా బలోపేతమైంది. వేగంగా పురోగమించింది. చైనాను అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన హయాంలో భారత్తో చైనా అన్ని రంగాల్లోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. హెచ్డీ దేవేగౌడ, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో ఆయన భారత్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications