దక్షిణ టిబెట్: నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై ఊగిపోయిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని ప్రాంతాలు దక్షిణ టిబెట్ భాగమని, దీనిపై తాము నిరసన తెలుపుతామని చెప్పింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం మోడీ గురువారం అరుణాచల్లో పర్యటించారు.
అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాలు దక్షిణ టిబెట్లో భాగమని చైనా అంటోంది. మోడీ ఆ ప్రాంతాల్లో పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. దీనిపై దౌత్యపరమైన నిరసన చేపడతామని హెచ్చరించింది.
మేం గుర్తించలేదు, వ్యతిరేకిస్తున్నాం
చైనా-భారత్ సరిహద్దు విషయంలో చైనా ఎప్పుడూ ఒకే విధంగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సరిహద్దులోని కొన్ని వివాదాస్పద భూభాగాలను అరుణాచల్కు చెందినవిగా చైనా ఎప్పుడూ గుర్తించలేదని, ఆ వివాదాస్పద ప్రాంతాల్లో భారత అధికారులు పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇరు దేశాలు సరిగ్గా వ్యవహరించాలి
అరుణాచల్ ప్రదేశ్లో వివాదాస్పద ప్రాంతంపై చైనా, భారత్ చర్చించాల్సి ఉందని అన్నారు. ఇరు దేశాలు సంప్రదింపులు, సంధి ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు. సరిహద్దు వివాదాల విషయంలో ఇరు దేశాలు సరిగ్గా వ్యవహరించాలని చెప్పారు.
ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది
దీనిపై ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని చైనా వెల్లడించింది. దీనికి భారత్ కూడా కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసినట్లవుతుందని హెచ్చరించింది.
తమవని చైనా వాదన
అరుణాచల్ ప్రదేశ్లో భారత నేతల పర్యటనను చైనా తరచూ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్లో కొన్ని భూభాగాలు తమవి అని చైనా వాదిస్తోంది.