షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్
నేలమీద.. వందలాదిగా పోగైన చైనా సైనికులు తమ ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు.. బాంబుల మోత, శతఘ్నుల చప్పళ్లుకుతోడు దగ్గర్లోనే మిస్సైల్ లాంఛర్లు కూడా ఉన్నాయి. అంతలోనే అక్కడి గగన తలంలోకి దూసుకొచ్చిన విమానాన్ని చూసి అందరూ డంగయ్యారు. అది అమెరికాకు చెందిన నిఘావిమానం యూఎస్-2 అని గుర్తించడానికి డ్రాగన్ కు ఎంతో సమయం పట్టలేదు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించి అమెరికా విమానం నోఫ్లై జోన్ లోకి దూసుకొచ్చిందని, దాని వల్ల తమ సైనిక విన్యాసాలను అర్థాంతరంగా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనా ప్రకటించింది. అమెరికా ఉల్లంఘనపై తీవ్రస్థాయిలో మండిపడింది.

సంచలన ఆరోపణ..
దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా ప్రయత్నిస్తుండగా, అక్కడి తైవాన్ జలసంధిలో తిష్టవేసిన అమెరికా యుద్ధనౌకలు డ్రానగ్ ను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. అయితే, మంగళవారం నాటి ఘటనలో అమెరికా నిఘా విమానం యూఎస్-2.. అంతర్జాతీయ నిబంధనల్ని అతిక్రమించిందని, నోఫ్లై జోన్ లోకి ప్రవేశించిందని చైనా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే రెండు దేశాలు ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్నవేళ యూఎస్-2 నిఘా విమానం వ్యవహారం దుమారం రేపుతున్నది.

చైనా రక్షణ శాఖ ఫైర్
‘‘నో ఫ్లై జోన్ లోకి ప్రవేశించిన అమెరికా విమానంపై మేము తప్పుగా అంచనా వేసినా.. ఒకవేళ దానికే ఏదైనా ప్రమాదం జరిగి ఉన్నా అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చెప్పడం కష్టం. అమెరికా ఉల్లంఘన వల్ల మా సైనిక విన్యాసాలను నిలిపేయాల్సి వచ్చింది. అమెరికా అతిక్రమణను మేం ఖండిస్తున్నాం. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచివికాదు'' అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వూ కియాన్ మీడియాతో అన్నారు. నో ఫ్లై జోన్ లో యూఎస్-2 నిఘా విమానం ప్రవేశించిందన్న ఆరోపణలపై యూఎస్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ భిన్నంగా స్పందించింది.

అమెరికా వివరణ
నిఘా విమానం యూఎస్-2 విన్యాసాలు చేయడం నిజమేనని, అయితే చైనా ఆరోపిస్తున్నట్లు తాము అతిక్రమణకు పాలపడలేదని, నో ఫ్లై జోన్ లోకి ప్రవేశించలేదని, గగన తలంలో అంతర్జాతీయ పరిధిలోపలే అది తిరుగాడిందని యూఎస్ పషిఫిక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వివరణ ఇచ్చారు. కాగా, యూఎస్-2 నిఘా విమానంపై చైనా చేసిన ఆరోపణ చాలా చీప్ గా ఉందని అమెరికా రక్షణ వ్యవహారాల నిపుణుడు కార్ల్ షూస్టర్ అన్నారు.

యూఎస్-2 సూపర్ స్పెషల్
రష్యాతో కోల్డ్ వార్ కు ముందు(1950) నుంచే అమెరికా యూఎస్-2 నిఘా విమానాలను వాడుతోందని, శత్రువుల మిస్సైళ్లకు కూడా చిక్కకుండా 70వేల అడుగుల ఎత్తులో ఆ విమానం ప్రయాణించగలదని, కాల క్రమంలో యూఎస్-2లో చోటుచేసుకున్నని మార్పులు మరే యుద్ధవిమానానికీ జరిగి ఉండలేదని షూస్టర్ తెలిపారు. ‘‘చైనా చెబుతున్నట్లు దాని యుద్ధ విన్యాసాలను చిత్రీకరించడానికి యూస్-2 నిఘావిమానం అంత దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఉన్నచోట నుంచే 20 కిలోమీటర్ల దూరాన్ని సైతం స్కాన్ చేయగలుగుతుంది. దాంట్లో ఎలక్ట్రిక్, లాంగ్ రేంజ్ ఇన్ ఫ్రారెడ్ ఇంకా ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ కూడా అమర్చారు. సుదూరాలను సైతం స్కాన్ చేయగల ఈ నిఘా విమానం గురించి చైనాకు కూడా తెలుసు''అని షూస్టర్ వివరించారు.

బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లే..
అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరుతుండటం గమనార్హం. సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఇలాంటిదే ఓ షాకింగ్ అంశం బయటికొచ్చింది. తైవాన్ జలసంధిలో ఉంటోన్న 'యూఎస్ఎస్ రఫాయిల్ పెరాల్టా' యుద్ధ నౌక నుంచి బయలుదేరిన రెండు యుద్ధ విమానాలు చైనా గగనతలానికి అతి సమీపంగా వచ్చాయని, ఓ విమానం షాంఘై సిటీకి 76.5 కిలోమీటర్ల సమీపంగా, మరో విమానం ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ తీరానికి 106 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినట్లు హాంకాంగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. దానిపై రెండు దేశాల నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ గెలిస్తే, చైనా తిరిగి అమెరికాను ఆక్రమించే ప్రమాదముందని, అయితే దాన్ని అడ్డుకునే సత్తా తనకు మాత్రమే ఉందని రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications