కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం..
కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండటంతో చైనా అప్రత్తమైంది. కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో దేశంలో వన్యప్రాణుల మాంస విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశం బయటపడేంతవరకు వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. వుహాన్ అనే పట్టణంలోని వన్యప్రాణుల మాంస విక్రయ మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టుగా అనుమానిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అప్పట్లో వణికించిన సార్స్..
17 ఏళ్ల క్రితం చైనాను వణికించిన సార్స్ వైరస్ ఉదంతం నుంచి చైనా పాఠాలు నేర్వలేకపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సార్స్ కారణంగా అప్పట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతారు. వన్య ప్రాణులు,పెంపుడు జంతువుల మాంసాన్ని విక్రయించే మార్కెట్ల నుంచే సార్స్ వ్యాధి ప్రబలింది. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అదే జరిగింది. అప్పటి సార్స్ ఉదంతం నుంచి చైనా పాఠాలు నేర్చి ఉంటే.. ఈ ఘోర పరిస్థితి తలెత్తేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
నిషేధ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..
ప్రస్తుతం చైనాలో వన్యప్రాణి మాంస విక్రయాలు,వన్యప్రాణుల తరలింపుపై నిషేధం విధించారు. మార్కెట్లు,రెస్టారెంట్లు,ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్.. ఎక్కడైనా వన్యప్రాణులు,వాటి మాంసం విక్రయాలు జరపరాదని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అక్రమంగా వన్య ప్రాణులను విక్రయించినా.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా తమకు సమాచారం అందజేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
శాశ్వతంగా నిషేధించాలన్న డిమాండ్..
దేశ ప్రజలు కొన్నాళ్ల పాటు వన్యప్రాణి మాంసాన్ని తినవద్దని,ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ,అటవీ శాఖ విజ్ఞప్తి చేశాయి. మరోవైపు వన్యప్రాణుల మాంస విక్రయాలను చైనాలో శాశ్వతంగా నిషేధించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. లేదంటే.. భవిష్యత్తులో ఇలాంటి వైరస్లు తరుచూ పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైతే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు.
యుద్దప్రాతిపదికన ఆస్పత్రుల నిర్మాణం..
కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చైనాలో 56 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయినవారిలో ఎక్కువ మందికి వుహాన్ లోని సీ ఫుడ్ మార్కెట్ నుంచే వైరస్ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. ఇక దాదాపు 2000 మంది ప్రస్తుతం కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వెయ్యి పడకలు,1500 పడకల ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయించింది.