ఒకేసారి 10వార్హెడ్ల పరీక్ష విజయవంతం: ట్రంప్కు చైనా సవాల్!
చైనా మరోసారి తన అణ్వాయుధ బలాన్ని చాటుకుని ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరింది.
బీజింగ్: చైనా మరోసారి తన అణ్వాయుధ బలాన్ని చాటుకుని ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరింది. పది న్యూక్లియర్ వార్హెడ్స్ను మోసుకెళ్లగలిగే మిస్సైల్ను చైనా విజయవంతంగా పరీక్షించినట్లు వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు.. చైనా తన సత్తా చాటిచెప్పేందుకే ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.
జనవరిలో నెలలో డీఎఫ్-5సీ అనే మిస్సైల్ను పది మల్టీపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్స్(ఎంఐఆర్వీ) సాయంతో పరీక్షించినట్లు వాషింగ్టన్ ఫ్రీ బీకన్ వెల్లడించింది. ఈ మిస్సైల్ పరీక్షను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు నిశితంగా పరిశీలించాయని సంబంధిత అధికారులు తెలిపారు.
పది న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్న డాంగ్ఫెంగ్-5సీ మిస్సైల్ను షాంగ్జిలోని తైయువాన్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి లాంచ్ చేశారని, అది పశ్చిమ చైనాలోని ఎడారి ప్రాంతంలోని లక్ష్యాన్ని ఛేదించిందని వాషింగ్టన్ ఫ్రీ బీకన్ చెప్పింది. కాగా, 1980ల్లో చైనా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి డీఎఫ్-5కు ఇది అప్గ్రేడ్ కావడం గమనార్హం.
రక్షణ విభాగం చైనీస్ మిలిటరీ చర్యలను తరచూ పరిశీలిస్తూనే ఉంటుందని పెంటగాన్ అధికార ప్రతినిధి గ్యారీ రోస్ వెల్లడించారు. కొన్ని దశాబ్దాల నుంచి చైనా అణ్వాయుధాలపై నిఘా ఉంచిన అమెరికా.. 250 వార్హెడ్స్ ఉన్నట్లు లెక్క తేల్చింది.
కాగా, తాజాగా పది వార్హెడ్స్తో మిస్సైల్ను ప్రయోగించడం చూస్తే.. చైనా దగ్గర ఇంకా ఎక్కువే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. లాంగ్రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగాలు ఎక్కువ కావడం, చైనా అణు సామర్థ్యంపై అస్పష్టత ఆ ప్రాంతంలో అస్థిరతకు దారి తీస్తుందని అమెరికా రక్షణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యంకు పోటీగా చైనా ఇలా అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడంపై పలువురు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.