ఊహకందని అస్త్రం: చైనా వినాశకర వ్యూహం! అమెరికానే టార్గెట్..
అంతరిక్ష సరిహద్దుల్లో చైనా సరికొత్త సైనిక విప్లవానికి తెరతీసింది. వేల మైళ్ల దూరంలో గాల్లో ఎగురుతున్న శత్రుదేశాల యుద్ధ విమానాలు, కీలకమైన విమాన వాహక కేంద్రాలను సెకన్ల వ్యవధిలో ధ్వంసం చేసే అత్యంత ప్రమాదకరమైన 'హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV)' పరిజ్ఞానాన్ని డ్రాగన్ సిద్ధం చేసింది. కేవలం సాధారణ క్షిపణులకే పరిమితం కాకుండా, గాల్లోంచి గాల్లోకి శత్రు లక్ష్యాలను పేల్చివేసే మిస్సైళ్లను ఈ హైపర్ సోనిక్ వ్యవస్థలకు జోడించడం ద్వారా చైనా తన సైనిక వ్యూహాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. ఇది ప్రపంచ రక్షణ రంగంలో సరికొత్త ఆందోళనకు దారితీసింది.
చైనా కొత్తగా అభివృద్ధి చేసిన డీఎఫ్-17 (DF-17) క్షిపణి ద్వారా ప్రయోగించే ఈ గ్లైడ్ వెహికల్ దాదాపు 1,500 మైళ్ల దూరంలోని లక్ష్యాలను నిమిషాల్లో చేరుకోగలదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని కీలకమైన అమెరికా సైనిక స్థావరం 'గువామ్'ను నేరుగా తాకే సామర్థ్యం కలిగి ఉంది. ఇక మరింత శక్తివంతమైన డీఎఫ్-27 (DF-27) మిస్సైల్ దాదాపు 5,000 మైళ్ల పరిధితో అమెరికాలోని హవాయి ద్వీపాలను కూడా చేరుకోగలదు. యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ కార్యకలాపాలు నడిపే అమెరికా కమాండ్ కంట్రోల్ విమానాలు, ఎయిర్బోర్న్ వార్నింగ్ విమానాలకు (AWACS) ఈ అస్త్రంతో తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

గాల్లోనే దిశ మార్చుకునే వినాశకర వ్యూహం
సాధారణ మిస్సైళ్లను శత్రుదేశాల రక్షణ వ్యవస్థలు (మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్) ముందే గుర్తుపట్టి గాల్లోనే పేల్చివేయగలవు. కానీ, ఈ 'హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్స్' శబ్ద వేగాన్ని మించి ప్రయాణించడమే కాకుండా, వాతావరణంలో ఎటుబడితే అటు తమ ప్రయాణ దిశను మార్చుకోగలవు. దీనివల్ల వీటిని అడ్డుకోవడం ప్రపంచంలోని ఏ అత్యాధునిక రక్షణ వ్యవస్థకూ సాధ్యం కాదు. ఇలాంటి హైపర్ సోనిక్ వ్యవస్థ నుంచి 'ఎయిర్-టు-ఎయిర్' మిస్సైళ్లను ప్రయోగించే సాంకేతికత ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఇతర దేశం వద్ద లేకపోవడం డ్రాగన్ బలాన్ని చాటుతోంది.
సాంకేతిక సవాళ్లు.. పొంచి ఉన్న అణ్వాయుధ ప్రమాదం
ఈ సాంకేతికత ఎంత ప్రమాదకరమైనదో, అంతటి సంక్లిష్టమైనదని కూడా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే విమానాన్ని కచ్చితంగా గుర్తించి క్షిపణిని ప్రయోగించడం అంత తేలిక కాదు. రాడార్ లేదా సెన్సార్ల సంకేతాలు కొద్దిగా విఫలమైనా లక్ష్యం తప్పిపోతుంది. అంతేకాకుండా, చైనా ప్రయోగించే ఈ రకమైన క్షిపణులను చూసి శత్రుదేశాలు అవి 'అణ్వాయుధ దాడులు'గా భావించే ప్రమాదం ఉంది. దీనివల్ల చిన్నపాటి సైనిక ఘర్షణ కూడా అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భారత్కు ఎలాంటి ముప్పు రానుంది?
చైనా క్షిపణి వ్యవస్థ వేగంగా విస్తరించడం పొరుగున ఉన్న భారత్కు కూడా ఆందోళన కలిగించే అంశమే. 2015 నుంచి చైనా తన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను ఏకంగా 147 శాతం పెంచుకుంది. ఆసియా ఖండంలో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా సిద్ధం చేసుకుంటున్న ఈ సుదూర అస్త్రాలు, సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. చైనా తయారుచేసిన సుదూర పరిధి 'PL-15' మిస్సైళ్లను ఇప్పటికే పొరుగు దేశాలు వినియోగిస్తున్న తరుణంలో, భారత వైమానిక దళం తన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.














Click it and Unblock the Notifications